సాంస్కృతిక పునరుజ్జీవంతో భారత్‌కు పూర్వ వైభవం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన 2014 నుంచి సాంస్కృతిక పునరుజ్జీవన శకం ప్రారంభమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా  చెప్పారు. ఈ ప్రస్థానం భారత దేశాన్ని తన పూర్వ వైభవం దిశగా నడిపిస్తుందని తెలిపారు.
 బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీ రాజ్’ సినిమా చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ  భారత దేశం లెక్కలేనన్ని ప్రతికూలతలను ఎదుర్కొందని చెప్పారు. గతంలో ప్రపంచానికి మార్గదర్శిగా భారత్ నిలిచిందని తెలిపారు.
అనేక ప్రతికూలతలను ఎదుర్కొన్న తర్వాత ప్రస్తుతం మన దేశ ఔన్నత్యం, సంస్కృతి, సహజసిద్ధ విశ్వాసం చాలా కాలం తర్వాత తిరిగి తన పూర్వ వైభవానికి చేరుకునే బాటలో ఉన్నట్లు  ఆయన తెలిపారు.
1025లో సుదీర్ఘ ప్రయాణం ప్రారంభమైందని, అందులో మహమ్మద్ గజనీతో పృథ్వీరాజ్ యుద్ధం ఓ భాగమని చెప్పారు. గజనీ గుజరాత్‌పై దాడి చేసి, సోమనాథ దేవాలయాన్ని దోచుకున్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. భారత దేశానికి స్వాతంత్య్రం రావడంతో 1947లో ఈ సుదీర్ఘ ప్రయాణం ముగిసిందని పేర్కొన్నారు. తాను చరిత్రను చాలా శ్రద్ధగా చదివే విద్యార్థినని తెలిపారు.
భారత దేశంపైనా, భారతీయ సంస్కృతిపైనా అనేక మంది దాడి చేశారని పేర్కొంటూవారిపై పోరాటం ఎన్నటికీ అంతం కాదని స్పష్టం చేశారు. వారితో అనేక ప్రాంతాల్లోని రాజులు పోరాడి, భారత దేశ సంస్కృతిని కాపాడి, పరిరక్షించడానికి కృషి చేశారని తెలిపారు.
ఈ సినిమాలో పృథ్వీరాజును చూపించిన తీరును ప్రశంసించారు. వందలాది పుస్తకాలకు సాధ్యం కానంతటి స్థాయిలో ఓ సినిమా మన ఆత్మగౌరవాన్ని ప్రేరేపిస్తుందపి. ప్రజలకు అవగాహన కల్పిస్తుందని చెప్పారు. వేలాది పేజీలు గల పుస్తకానికి సాధ్యం కాని రీతిలో రెండున్నర గంటల సినిమా ఓ మహా నాయకుడి పట్ల అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు.
‘సామ్రాట్ పృథ్వీ రాజ్’ సినిమా దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేదీ, నటీనటులు అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ తదితరులను  అమిత్ షా ప్రశంసించారు. ఈ సినిమా కేవలం పృథ్వీరాజ్ మాతృభూమి కోసం ధైర్యసాహసాలతో చేసిన పోరాటాన్ని మాత్రమే కాకుండా, ఆ కాలం నాటి సాంస్కృతిక వైభవాన్ని కూడా చూపించిందని అమిత్ షా కొనియాడారు. మహిళా సాధికారత గురించి మాట్లాడేవారు ఈ సినిమాను తప్పకుండా చూడాలని హితవు చెప్పారు.
 
యుపిలో పన్ను నుండి మినహాయింపు 
 
కాగా,  ‘పృథ్వీరాజ్’ సినిమాకి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వినోద పన్ను నుండి మినహాయింపు  ప్రకటించింది. ఈ సినిమాను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తన కేబినెట్ తో కలిసి రాజ్ భవన్ లో స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా చూశారు. అనంతరం సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
 
ప్రతి ఒక్క సామాన్యుడు ఈ చిత్రం వీక్షించాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చరిత్రను తెలిపే విధంగా సినిమా ఉందని ఆయన కొనియాడారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్ ’ చిత్రం ప్రతీ ఒక్కరు చూడదగినదని తెలిపారు. ఈ చిత్రంలో సోనూసూద్ కూడా ఒక ముఖ్య‌పాత్ర‌ని పోషిస్తున్నారు.