తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం జరపాలని బిజెపి కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. హైదరాబాద్ లో అధికార కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన ఆయన బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వద్ద స్వాగతం పలకడానికి వచ్చిన బిజెపి కార్యకర్తలకు అభివాదం చేస్తూ తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలని స్పష్టం చేశారు.
కుటుంబపాలన ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందన్న ప్రధాని తెలంగాణ భవిష్యత్తు, గౌరవం కోసం బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెబుతూ ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
కుటుంబ పాలన చేసేవారు దేశ ద్రోహులు అని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ కుటుంబ పాలనతో అవినీతిమయం అయ్యిందని అంటూ కేసీఆర్, కేటీఆర్పై దాడి చేశారు. పేదల సమస్యలు కుటుంబ పార్టీలకు పట్టవని.. బీజేపీ పోరాటం తెలంగాణ అభివృద్ధి కోసమేనని ప్రధాని తెలిపారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని ధ్వజమెత్తుతూ అయినా ప్రజల మనసులో బీజేపీని తీసేయలేరని స్పష్టం చేశారు.
తెలంగాణ పోరాటంలో వేలాది మంది త్యాగం చేశారని, తెలంగాణ ఉజ్వల భవిష్యత్ కోసం ఈ త్యాగాలు చేశారని పేర్కొంటూ ఒక్క కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదని ప్రధాని తేల్చి చెప్పారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవారు నాడు-నేడు కూడా ఉన్నారని హెచ్చరించారు.
తెలంగాణ పాలకులకు అంధవిశ్వాసాలు పెరిగాయంటూ పరోక్షంగా కేసీఆర్ను ప్రధాని ఎద్దేవా చేశారు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే అరిష్టమని భావించే ధోరణిని ప్రధాని తప్పుబట్టారు. సెక్రటేరియట్తో పాటు కొన్ని చోట్లకు వెళ్లాలంటే మూఢనమ్మకాల కారణంగా భయపడుతున్నారని ప్రధాని పరోక్షంగా కేసీఆర్కు చురకలంటించారు.
తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా కొందరు తనను కొన్ని చోట్లకు వెళ్లొద్దన్నారని, అయినా ఆధునిక విజ్ఞానాన్ని నమ్మి అన్ని చోట్లకూ వెళ్లానని మోదీ గుర్తు చేశారు. కాషాయ వస్త్ర ధారి అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా నోయిడా వెళ్లి మూఢ నమ్మకాలకు చెక్ పెట్టడమే కాక తిరిగి ముఖ్యమంత్రిగా గెలిచారంటూ మోదీ హర్షధ్వానాల మధ్య చెప్పారు.
21వ శతాబ్దంలో కూడా అంధ విశ్వాసాలను నమ్మే పాలకుల కారణంగా తెలంగాణ ప్రజలు నష్టపోతారని ప్రధాని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రాన్ని బంధించాలని కొందరు చూస్తున్నారని చెబుతూ తెలంగాణ అభివృద్ధి నిరోధకులు నాడే కాదు నేడు కూడా ఉన్నారని అంటూ పేరు ప్రస్తావించకపోయినా కేసీఆర్ ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీజేపీ కార్యకర్తలపై దాడుల విషయం తన దృష్టికి వచ్చిందని, తెలంగాణ కోసం ముగ్గురు పార్టీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని చెబుతూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ‘దేశ సమగ్రత మన చేతుల్లోనే ఉంది. మీ ప్రేమ నా బలం. ఇంత ఎండలోనూ మీరు నాకు ఘనస్వాగతం పలికారు. బీజేపీ చెందిన ఒక్కొక్క కార్యకర్త సర్ధార్ పటేల్ ఆశయాల కోసం పోరాడుతారు. భారతదేశానికి సేవ చేసేందుకు మనమంతా పనిచేస్తాం’ అంటూ ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
తెలంగాణను టెక్నాలజీ హబ్ గా చేయాలనుకుంటుంన్నామని చెప్పారు. యువతతో కలిసి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం అని తెలిపారు. తెలుగు మాటలతో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ `తెలంగాణ ప్రజలకు నమస్కారం.. ‘ అంటూ పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలకు పేరుందని మోదీ చెప్పుకొచ్చారు. తెలంగాణకు ఎప్పుడొచ్చినా ప్రజల రుణం పెరిగిపోతుందని అనిపిస్తోందని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు చూపించే అభిమానం, ఆప్యాయతలకు రుణపడి ఉంటానని మోదీ నమస్కరించి చెప్పారు.
More Stories
సీఎం రమేష్ అరెస్ట్.. కాన్వాయ్ పై వైసీపీ నేతల దాడి
మాదిగలు, బిసిలు కాంగ్రెస్కు ఓటేయవద్దు
జీఎస్టీ రిఫండ్ పేరుతో రూ.100 కోట్ల కుంభకోణం