బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తా

తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తామని, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  ప్రకటించారు. అధికారిక భాషగా ఉన్న ఉర్దూను శాశ్వతంగా నిషేధిస్తామని వెల్లడించారు. 
 
  హనుమాన్‌ జయంతి సందర్భంగా బుధవారం కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటూ తెలంగాణలో వేలాది ఆలయాలను గతంలో ధ్వంసం చేశారని, మసీదులు తవ్వితే శివలింగాలు బయటపడతాయని ఆరోపించారు. కరీంనగర్ నడిబొడ్డున ఈద్గా పోవాలన్నా… వేములవాడలో దర్గా పోవాలంటే రామరాజ్యం రావాల్సిందే అని స్పష్టం చేశారు.
 ‘‘దేశంలో 36 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టారు. ఏ మసీదును తవ్వినా శివలింగాలు బయటపడుతున్నాయి. కాశీలోని మసీదులోనూ ఇదే జరిగింది. తెలంగాణలోనూ మసీదులను తవ్వితే శివలింగాలు కనిపిస్తాయి. ఆ తవ్వకాల్లో శివలింగం కనిపిస్తే ఆ ప్రాంతం మాది (హిందువులది). శవాలు కనిపిస్తే మీది (ముస్లింలది). మసీదులు తవ్వేందుకు సిద్ధమేనా’’ అంటూ మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి సంజయ్‌ సవాల్‌ విసిరారు.
 
 ‘‘తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో కడిగేసి రామరాజ్యం స్థాపించి తీరుతాం. లవ్‌ జిహాదీ అంటే లాఠీ రుచి చూపిస్తాం. మత మార్పిడిలు చేస్తే మక్కెలిరగదీస్తాం” అంటూ హెచ్చరించారు. 
 మైనారిటీ సంతుష్ట విధానాలతో హిందూ సమాజాన్ని హేళన చేస్తున్న కుహానా లౌకిక వాదులను తరిమితరిమి కొట్టడమే హిందూ ధర్మ రక్షకుల ప్రధాన కర్తవ్యం అని తేల్చి చెప్పారు.   లవ్ జిహాదీ పేరుతో నా అక్కా చెళ్లెళ్లను ట్రాప్ చేస్తే ఊరుకుందామా? పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మతమార్పిళ్లు చేస్తే ఊరుకుందామా? అని ప్రశ్నించారు.
 
ఇప్పటి వరకు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారు….  అతి త్వరలో రజాకార్ల ఫైల్స్‌ సినిమా రాబోతోందది. రజాకారుల అకృత్యాలను తెలంగాణ ప్రజలకు చూపిస్తాం అని వెల్లడించారు.  కరీంనగర్‌ బస్టాండ్‌లో, కోరుట్లలో, జగిత్యాలలో, లుంబినీ పార్కు, గోకుల్‌ చాట్‌లలో, సాయిబాబా గుడిలో బాంబులు పెట్టి అమయాకుల ప్రాణాలు తీసింది మీరు కాదా? వరంగల్‌లో పూజారిని, నాగరాజును హత్యచేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా ఇక్కడే మూలాలుంటున్నయని,  ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మదర్సాలున్నయని అంటూ వాళ్లకు ఇంకా కంప్యూటర్లు, ఇతర ఆర్దిక సాయం చేస్తుండటం సిగ్గు చేటని విమర్శించారు. బిజెపి అధికారంలోకి రాగానే అనేక మంది ముస్లిం పేద మహిళలు ట్రిపుల్ తలాఖ్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్లందరికీ ఉపాధి కల్పిస్తామని సంజయ్ తెలిపారు.