ప్రపంచంలోనే బలమైన దేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలలో పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్, ఒఇసిడి, జి20 వంటి సంస్థలలో ఈ దేశాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఈ దేశాల్లో ద్రవ్యోల్బణం పరిస్థితి చూస్తే అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు 8.3 శాతానికి పెరిగింది. ఇదే 40 ఏళ్ల గరిష్ఠ స్థాయి అని యుఎస్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఇక బ్రిటన్లో 7 శాతానికి చేరగా, ఇది కూడా 1992 నుంచి అత్యధిక స్థాయి కావడం గమనార్హం. స్పెయిన్లో 8.4 శాతం, జర్మనీలో 7.4 శాతం, ఇటలీలో 6.2 శాతం నెలకొనడం గమనార్హం. మన పొరుగుదేశం పాకిస్థాన్లో అయితే 15.1 శాతం అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు.
అమెరికాలో నాలుగు దశాబ్దాల తర్వాత ప్రజలు గరిష్ఠ ద్రవ్యోల్బణాన్ని చూస్తున్నారు. అక్కడ ఆహారం, పానీయాల ధర 10 శాతం పెరగ్గా, విద్యుత్ ధర 32 శాతం పెరిగింది. బ్రిటన్ పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఇంధన ధరలు 31 సంవత్సరాలలో అత్యధికంగా పెరిగాయి. ప్రతిరోజూ ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు 10 శాతానికి పైగా పెరిగాయి.
జర్మనీ 1981 సంవత్సరం తర్వాత చాలా ద్రవ్యోల్బణాన్ని చూస్తోంది. అమెరికా, బ్రిటన్, టర్కీ, పాకిస్థాన్తో సహా చాలా దేశాల్లో భారత్లో కంటే ద్రవ్యోల్బణం చాలా రెట్లు ఎక్కువగా ఉంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్తో సహా అనేక ఐరోపా దేశాలలో ఆహార, నూనెల నిల్వలు తగ్గుతున్నాయి.
ప్రజలు అవసరానికి మించి కొంటున్నారు. ఈ పరిస్థితిలో చాలా ఐరోపా దేశాల్లోని సూపర్ మార్కెట్లలో వినియోగదారులకు పరిమిత పరిమాణంలో వస్తువులను విక్రయించాలనే నియమం అమలు చేస్తున్నారు. అంతేకాదు ఐరోపా దేశాల్లో చాలా పరిశ్రమ, -వ్యాపారాలు ఉద్యోగుల తొలగింపు సంకేతాలు ఇస్తున్నాయి.
More Stories
మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం
మనం హిందువులమని గర్వంగా చెప్పుకోగలగాలి
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఈసీ వేటు