పీఎం వస్తున్నారని ముఖం చెల్లక పారిపోతున్న కేసీఆర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు వింటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ గజగజ వణికి పోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. అందుకే ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిసినా మొఖం చెల్లక కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపన సమయంలోనూ ప్రధాని పర్యటన సందర్భంగా  కేసీఆర్ ఇదే విధంగా వ్యవహరించారని గుర్తు చేశారు.
 
ఢిల్లీలో చనిపోయిన రైతులకు కేసీఆర్ ఆర్దిక సాయం చేయడంపై తీవ్రంగా స్పందిస్తూ  టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వేలాది మంది రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులుసహా చివరకు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయి వడ్ల కుప్పలపై పడి రైతులు గుండె పగిలి చనిపోయారని గుర్తు చేశారు. 
 
 ఆయా కుటుంబాలకు ఏనాడూ నయాపైసా సాయం చేయని కేసీఆర్ ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల రైతులకు ఆర్దిక సాయం చేస్తుండటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఈ నెల 26న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో పార్టీ తరపున ఘన స్వాగతం పలికేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
 ఈ సమావేశంలో ఆయా జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ  26న ప్రధాని మోదీ హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో పార్టీ తరపున కనీవినీ ఎరగని రీతిలో అపూర్వ స్వాగతం పలుకుదామని పిలుపిచ్చారు.
 
 కేసీఆర్ ప్రచారం  కోసం, ప్రజల చర్చను దారి మళ్లించేందుకు ఇతర రాష్ట్రాల రైతులకు ఆర్దిక సాయం చేస్తున్నట్లు నటిస్తున్నారని ఆయన ఆరోపించారు.   రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు స్రుష్టించినా అమిత్ షా సభ సక్సెస్ కావడంతో కేసీఆర్, ఆయన కొడుకు డిప్రెషన్ లోకి వెళ్లి కాయిల్ తప్పి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా జరగడంతో పాటు బీజేపీ సభలకు వస్తున్న జన స్పందనను చూసి టీఆర్ఎస్-కాంగ్రెస్ బీజేపీలోకి ఏ నాయకుడూ ఇమడలేరంటూ దుష్ప్రచారం చేస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేయసారు. బీజేపీ ఏనాడూ ఎవరో వస్తారని ఎదురు చూడదని స్పష్టం చేశారు. అయితే, పార్టీ సిద్ధాంతాలు, విధానాలను చూసి వస్తే స్వాగతిస్తాం. తగిన గౌరవమిస్తాం అని తెలిపారు.
 
ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నందున ఎయిర్ పోర్టు నుండి గచ్చిబౌలి వరకు ఆయన వెళ్లే మార్గంలో కనీవినీ ఎరగని రీతిలో వేలాది మందితో అపూర్వ స్వాగతం పలుకుదామని సూచించారు. రాజధాని యావత్తు హోర్డింగులు, ఫ్లెక్సీలతో కాషాయ మయం చేద్దామని చెప్పారు.  అందుకోసం ప్రతి డివిజన్ లో సమావేశం నిర్వహించి కార్యకర్తలు, ప్రజలంతా మోదీకి స్వాగతం పలికేలా సమాయత్తం చేయాలని కోరారు. 
 
 ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలంగౌడ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష తదితరులు పాల్గొన్నారు.