సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని ప్రభుత్వం సమగ్ర రక్షణ వ్యూహంలో ప్రధాన భాగమని రక్షణ మంత్రిరాజ్నాథ్ సింగ్ తెలిపారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొంటూ ఇది దేశ భద్రతా యంత్రాంగాన్ని బలపరుస్తుందని, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు.
రక్షణ వ్యూహంలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలక భాగమని చెబుతూ సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎంత శక్తివంతం అవుతారో, ఆ ప్రాంతాల భద్రత గురించి వారు మరింత అవగాహన కలిగి ఉంటారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మన సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి ముందుకు వెళ్లడానికి తాము కట్టుబడి ఉన్నామని, భద్రత కోసం 24 గంటలూ పనిచేసే వారికి ఆధునిక సౌకర్యాలు కల్పించడం మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా దాని సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని మరియు సరిహద్దు ప్రాంతాల మౌలిక సదుపాయాలను వేగంగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని బిఆర్వోకు రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ మధ్య కాలంలో ఉత్తర సెక్టార్లో చైనా ఉనికి పెరిగిందని, పర్వత ప్రాంతాల నిర్మాణంలో వారి నైపుణ్యం కారణంగా చాలా త్వరగా వివిధ ప్రాంతాలకు చేరుకోగలుగుతున్నారని పేర్కొన్నారు.
వారికి దీటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకుని తమ సామర్థ్యాన్ని పెంపొందించడంపై బిఆర్వో దృష్టి సారించాలి అని ఆయన సూచించారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా బిఆర్వోకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో బిఆర్వో మూలధన బడ్జెట్ను 40 శాతం అంటే.. రూ 3,500 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. కేవలం బడ్జెట్ మాత్రమే కాకుండా, ఈ ప్రయత్నంలో సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన బిఆర్వోకు హామీ ఇచ్చారు.
బిఆర్వో ప్రాజెక్ట్ ను చేపట్టే ప్రాంతాల్లోనే కాకుండా మొత్తం దేశానికి భద్రత, శ్రేయస్సు కోసం వర్క్ చేస్తున్నందుకు రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. బిఆర్వో కేవలం నిర్మాణ సంస్థ మాత్రమే కాదని, ఐక్యత, క్రమశిక్షణ, విధి పట్ల అంకితభావం ఉన్న సంస్థ అని ఆయన అభివర్ణించారు. దేశ ప్రగతిలో రోడ్లు, వంతెనలు, సొరంగాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన రక్షణ మంత్రి, బిఆర్వో ద్వారా పూర్తి చేసిన ప్రాజెక్టులు సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను మెరుగుపరిచాయని చెప్పారు.
సుదూర ప్రాంతాలలో నివసించే ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచాయని తెలిపారు. సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఊహించిన విధంగా బలమైన, సురక్షితమైన.. స్వావలంబనతో కూడిన ‘నూతన భారత్’ నిర్మాణానికి తిరుగులేని నిబద్ధతకు సూచికగా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
సరిహద్దు ప్రాంతాలు కొత్త అభివృద్ధి కేంద్రాలుగా ఆవిర్భవించాయని, ఈశాన్య ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా దేశ సర్వతోముఖాభివృద్ధికి గేట్వేగా మారాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈశాన్య ప్రాంతం భారతదేశాన్ని దక్షిణాసియా, ఆగ్నేయాసియాతో కలుపుతున్నందున, అంతర్జాతీయ స్థాయిలో దేశ పురోగతికి ఈ ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
బిఆర్వో తన 75 కేఫ్లు , టూరిజం పోర్టల్ ద్వారా సుదూర ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కూడా ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా, భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (బిసాగ్- ఎన్) అభివృద్ధి చేసిన బిఆర్వో రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, బిఆర్వో బడ్జెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే రెండు సాఫ్ట్ వేర్లను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. సాఫ్ట్ వేర్లు వనరుల పంపిణీ, వినియోగాన్ని అలాగే బిఆర్వో బడ్జెట్ను ఆటోమేట్ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
More Stories
అమిత్ షాకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం