1907లో సూరత్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత అతను తెలుగు వారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించారు. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయ ప్రభుత్వం కఠిన ధోరణితో వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చాలా అవసరం.
సెప్టెంబరు 1908లో బొంబాయి నుండి ఆయన ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై అతను అవగాహననూ ప్రతిబింబింప చేసెడివి.
1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను, రాజకీయ పరిణామాలను తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర పత్రిక దినపత్రికను కూడా ప్రారంభించారు. 1914 ఏప్రిల్ 1న మద్రాసు నుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. 1924లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.
మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి ఆరంభ దశ నుండి నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ప్రముఖులు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చెన్నై లోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్ ఒడంబడిక కుదిరింది.
కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.టంగుటూరి ప్రకాశం సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 – 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా వ్యవహరించారు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో ఆయన ఒకరు.
ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా 1931లో ఒక సంవత్సరం జైలులో ఉన్నపుడు నాగేశ్వరరావు భగవద్గీత గురించి వ్యాఖ్య వ్రాసారు. గీత ఒక మతానికి పరిమితమైనది కాదనీ, దాని సందేశం సమస్తమానవాళికీ వర్తిస్తుందని ఆయన వివరించారు. నాగేశ్వరరావు అసమాన దానశీలి. అతను ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవఅ కలాపాలకు ధారాళంగా అతను సహాయం చేస్తుండేవాడు. అతను ఇంటినుండి వట్టిచేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు.
కాశీనాథుని నాగేశ్వరరావు తెలుగు భాషాభిమానం, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రములలో ఆసక్తి అతను ఆయారంగాలలో వివిధ పత్రికల ప్రచురణకు చేసిన విశేషకృషి తెలుగుజాతి మరువలేనిది. వీరు భారతి, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు, ఆంధ్ర గ్రంథమాల, ఉగాది ప్రత్యేక సంచికలు కూడా వెలువరించారు.
బసవపురాణం, పడింతారాధ్య చరిత్ర, జీర్ణ విజయనగర చరిత్ర, తంజావూరాంధ్ర నాయకుల చరిత్ర మొదలగు పూర్వపు గ్రంథాలను, మాలపిల్ల, మహాత్మాగాంధీ ఆత్మకథ మున్నగు ఆధునిక గ్రంథాలు అనేకం ప్రచురించారు. 1938లో కొమర్రాజు వేంకటలక్ష్మణరావు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము మూడు సంపుటాలు ముద్రించారు.
తెలుగు నాటక రంగానికి కూడా ఆయన పలు రకాల సేవలు అందించారు. తెలుగు నాటకం అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర నాటక కళా పరిషత్ ను 1929లో స్థాపించిన నాటక రంగ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు. 1935 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది. ఆయనకు ఆంధ్ర మహాసభ వారు దేశోధ్ధారక అని బిరుదు ఇచ్చారు. ఆయన 1938లో మరణించారు.
More Stories
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్