ఎండలకు తోడుగా దేశవ్యాప్తంగా విద్యుత్కు డిమాండ్ బాగా పెరిగింది. ఓ పక్క ఉక్కపోత, మరోపక్క బొగ్గు కొరతతో రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ అవసరాలు తీర్చలేక చాలా రాష్ట్రాలు 2 నుంచి 8 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నాయి.
మార్చిలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏప్రిల్లో కూడా ఆ పరిస్థితి కొనసాగింది. దీంతో దేశంలో విద్యుత్ డిమాండ్ ఆల్టైమ్ గరిష్ఠస్థాయికి చేరుకుంది. దేశంలో 70 శాతం విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు అయిన బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడింది. చాలా రాష్ట్రాలు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
శుక్రవారం దేశంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 207.11 గిగా వాట్స్కు చేరుకుంది. ‘ఈ రోజు మధ్యాహం 2.50 గంటలకు దేశవ్యాప్త విద్యుత్ డిమాండ్ 207111 మెగావాట్లకు చేరుకుంది. ఇప్పటివరకు ఇదే ఆల్టైమ్ రికార్డు’ అని కేంద్ర విద్యుత్ శాఖ ఒక ట్వీట్లో తెలిపింది.
గురువారం గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 204.65 గిగా వాట్లుగా ఉంది. కాగా మంగళవారం నాడు గరిష్ఠ విద్యుత్ సరఫరా 201.06 గిగావాట్స్కు చేరింది.గత ఏడాది జూలై 7న రికార్డును ఇది అధిగమించింది. ఆ రోజు గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 200.53 గిగా వాట్స్గా ఉంది.
అయితే ఇంత భారీ ఎత్తున సరఫరా జరిగినప్పటికీ డిమాండ్ అంతకన్నా ఎక్కువగా ఉండడంతో మంగళవారం నాడు 8.22 గిగావాట్స్ విద్యుత్ లోటు ఉందని అధికార గణాంకాలను బట్టి తెలుస్తోంది. అలాగే బుధవారం నాడు కూడా ఇదే స్థాయిలో విద్యుత్ సరఫరా జరిగినప్పటికీ లోటు 10.29 గిగావాట్స్ ఉంది. రాబోయే రోజుల్లో వడగాడ్పుల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో విద్యుత్కు డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరం అయిన ముడి ఇంధన సరుకు బొగ్గు నిల్వలు అందకపోవడంతో పలు ప్రాంతాలలో కరెంటు ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. దీనితో విద్యుత్ కటకట ఏర్పడి వేసవిలో అత్యధిక కోతలు ఏర్పడ్డాయి.
ఈ పరిణామం నుంచి గట్టెక్కేందుకు ఇప్పుడు సాధారణ రైలు మార్గాలలో గూడ్స్ రైళ్ల ద్వారా బొగ్గుకేంద్రాల నుంచి బొగ్గును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ దారిలో ప్రయాణికుల రైళ్ల సందడి లేకుండా చేసేందుకు కేంద్రం హడావిడిగా ఉన్నతాధికారులతో చర్చించి 576 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్