కరోనా ముప్పు పూర్తిగా తొలగలేదు..అప్రమత్తంగా ఉండాలి

 
దేశంలో కరోనా ముప్పు పూర్తిగా తొలగలేదని, అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. దేశంలోని కరోనా పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని బుధవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ‌జరిపారు.  
 
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
 
మూడో వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాల మళ్లీ పెరుగుతుండటం, నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, దేశంలో కొత్తగా కరోనా కేసులు దాదాపు 3 వేలకు చేరుతున్న నేపథ్యంలో ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ అంశాలపై చర్చించారు. 
 
నాలుగో  వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందులు తరతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఇతర దేశాలతో పోలిస్తే కోవిడ్ సంక్షోభాన్ని మనం సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
కరోనా  సవాళ్లను ఇంకా అధిగమించ లేదనే విషయం మాత్రం చాలా స్పష్టమని ముఖ్యమంత్రులను ప్రధాని అప్రమత్తం చేశారు. కరోనా  బారిన పడకుండా చూసే రక్షణకవచం వ్యాక్సిన్లని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని వయోజనుల్లో 96 శాతం మంది కనీసం ఒకటి లేదా రెండు డోసులు తీసుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని చెప్పారు.
15 ఏళ్లు పైబడిన అర్హులైన వారిలో 85 శాతం మంది రెండో డోస్ తీసుకున్నారని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలపై అవగాహన కల్పించాలని సీఎంలకు ప్రధాని సూచించారు. అర్హత కలిగిన పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలని మార్గనిర్దేశం చేశారు.

పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్రాలే కారణం

కాగా, పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పెట్రో ధరలపై మొదటిసారి పెదవి విప్పిన ప్రధాని బిజెపియేతర రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కోరారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తేనే వాటి ధరలు తగ్గుతాయని తెలిపారు. 
 
గత ఏడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించిందని, ప్రజలపై భారం తగ్గాలనే లక్ష్యంతో ఈ చర్య తీసుకుందని ప్రధాని చెప్పారు. పన్నులను తగ్గించడం ద్వారా ఈ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేయాలని రాష్ట్రాలను కోరిందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాలు తమ పన్నులను తగ్గించుకున్నాయని, కానీ కొన్ని రాష్ట్రాలు ఈ ప్రయోజనాన్ని ప్రజలకు అందజేయలేదని చెప్పారు.
దీనివల్ల ఈ రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు అత్యధికంగా కొనసాగుతున్నాయని చెబుతూ ఓ విధంగా చెప్పాలంటే, ఇది ఆయా రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరగడం మాత్రమే కాకుండా, దీని ప్రభావం వాటి పొరుగు రాష్ట్రాలపై కూడా పడిందని ప్రధాని తెలిపారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, జార్ఖండ్, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఏదో కారణం చేత కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటను వినలేదని ప్రధాని విచారం వ్యక్తం చేశారు.
 ఫలితంగా ఆ రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులకు గురికావడం కొనసాగుతోందని తెలిపారు. ‘‘నవంబరులో మీరు చేసి ఉండవలసినదానిని, వ్యాట్‌ను తగ్గించడం ద్వారా ప్రజలకు ప్రయోజనాన్ని అందజేయాలని కోరుతున్నాను’’ అని మరోసారి ప్రధాని విజ్ఞప్తి చేశారు.
గత ఏడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై ఎక్సయిజ్ సుంకాన్ని రూ.5, లీటరు డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని రూ.10 చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే.