రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐతో ఏపీ గవర్నర్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వరుస భేటీలతో తీరిక లేకుండా గడిపారు. శనివారం మొదట ప్రధాని నరేంద్ర మోదీని కలసి, 40 నిముషాలకు పైగా మాట్లాడిన, ఆయన సోమవారం రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తో పాటు పలువురిని కలిశారు.
ప్రధానిని కలిసిన సందర్భంగా ఏపీలోని పరిస్థితులపై, ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక వ్యవహారాల  నిర్వహణ, పరిమితికి మించి, జవాబుదారీతనం లేకుండా అప్పులు చేస్తుండడంపై సవివరమైన నివేదిక ఇచ్చిన్నట్లు చెబుతున్నారు. ఆర్ధిక వ్యవహారాలపై కేంద్రం పలు వివరణలు కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో, గవర్నర్ నివేదిక ఇవ్వడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.
గత వారం అంతా అదనపు అప్పులకు ఏపీ ఆర్ధిక మంత్రి, ఆర్ధిక కార్యదర్శి ఢిల్లీలో మకాం వేసినా కేంద్రం నుండి అనుమతి పొందలేక తిరుగుముఖం పట్టిన సమయంలో గవర్నర్ ప్రధానిని కలవడం ఆసక్తి కలిగిస్తున్నది. సోమవారం  ఉదయం ముందుగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆయన నివాసంలో గవర్నర్ కలిశారు.
అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతికి పుష్పగుచ్ఛంతో పాటు వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహుమతిగా అందజేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్ ఆయనకు వివరించారు. సాయంత్రం సమయంలో హోం శాఖ మంత్రి అమిత్ షాను నార్త్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు.
రాత్రికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రపతి, రక్షణమంత్రి, హోంమంత్రితో గవర్నర్ బిశ్వభూషణ్ వరుస సమావేశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మర్యాదపూర్వక భేటీలనే చెప్తున్నప్పటికీ ఆయన కేంద్రానికి ఏయే అంశాలను నివేదిస్తున్నారనే అంశం ఉత్కంఠగా మారింది.
శుక్రవారం ఢిల్లీ వచ్చిన గవర్నర్ వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మంగళవారం ఆయన పర్యటన ముగించుకుని విజయవాడ తిరిగి చేరుకుంటున్నారు.