దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయబావుటా ఎగరవేస్తుందన్న భయంతోపాటు బీజేపీ బుల్డోజర్ వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే కారణంగానే తెలంగాణ మంత్రి కె. తారక రామారావు ప్రధాని మోదీపై హద్దు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. అందుకనే తెలంగాణకు కేంద్రం విస్తృతంగా సహాయం చేస్తున్నప్పటికీ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని కేటీఆర్ ఇటీవల బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని, దీనిని బట్టే బీజేపీ అంటే టీఆర్ఎస్కు ఉన్న భయమేంటో తెలుస్తోందని తెలిపారు. కేంద్రంపై విషం చిమ్ముతూ తప్పుడు రాతలు రాసినా, ప్రసారం చేసినా ఉపేక్షించేది లేదని పలు పత్రికలను ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు.
బీజేపీపై తప్పుడు ప్రచారం, విమర్శలు చేస్తే చట్టబద్ధంగా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 రెట్లు ఎక్కువగా తెలంగాణకు నిధులు ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యానికి కుటుంబ పార్టీల నుంచి ముప్పు పొంచి ఉందని చెబుతూ ఆ పార్టీల పాలన దూరం చేసేలా 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని ఖరారు చేశారని జివిఎల్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలలో కేంద్ర వాటాకింద నిధులు ఇస్తున్నా, ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్సీపీ స్టిక్కర్లు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉపయోగిస్తే, కేంద్రం వాటా ఉందని చెప్పాలని, తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది స్పష్టం చేశారు.
సబ్సిడీ బియ్యం పథకానికి మీ ఫొటోలు ఎలా పెడతారు? అంటూ ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రులు పర్యటించి, కేంద్ర పథకాలపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను కలసి దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే అంశాలకే నిధులు ఇవ్వాలని కోరతానని చెప్పారు.
More Stories
మాదిగలు, బిసిలు కాంగ్రెస్కు ఓటేయవద్దు
జీఎస్టీ రిఫండ్ పేరుతో రూ.100 కోట్ల కుంభకోణం
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్