బాంచన్ బతుకులు కావాలా….. పేదల రాజ్యం కావాలా?

ప్రజలారా… బాంచన్ బతుకులు కావాలా? …. పేదల రాజ్యం కావాలా? ఆలోచించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మోసకారి. పచ్చి అబద్దాలు కోరు. అవినీతి పరుడు. ఇలాంటి వ్యక్తి ప్రపంచంలోనే మరొకరు లేరని ధ్వజమెత్తారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం 5 గురికి ఉద్యోగాలిచ్చుకుని నెలకు రూ.25 లక్షల జీతం సంపాదించుకుంటున్నారని మండిపడ్డాయిరు.  ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా  11వ రోజు నర్వ మండలంలో పాదయాత్ర చేస్తూ కేసీఆర్ అంటే కోతల చంద్రశేఖర్ రావు.  ఆయన మాటలు నమ్మి ప్రజలు బాగా నష్టపోయారని తెలిపారు.

కేసీఆర్ ను దించాలనే కసితో పాదయాత్ర చేస్తన్నామని చెబుతూ నర్వ మండలంలో మూడు రిజర్వాయర్లున్నయ్. కానీ నీళ్లు మాత్రం రావడం లేదని చెప్పారు. కేసీఆర్ కు ఫాంహౌజ్ కట్టుకోవడానికి 2, 3 వందల ఎకరాలిస్తే… ఆయన కోసం నీళ్లు తెచ్చుకుంటడు.. మీకూ అక్కడక్కడా నీళ్లిస్తరు. లేకుంటే రావని గుర్తు చేసారు.

గజ్వేల్ లో కేసీఆర్ ఫాంహౌజ్ కు నీళ్లు తెచ్చుకోవడానికి లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి నుండి నీళ్లు తెచ్చుకుండు. ఇక్కడ 3, 4 వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావొచ్చు.  కానీ కేసీఆర్ కు ఇక్కడి ప్రజలకు నీళ్లించేందుకు మనసు రాదని విమర్శించారు.

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో మాట్లాడి ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం చూపామని చెబుతూ రాష్ట్రం సహకరిస్తే 6 నెలలో నీళ్లు తీసుకురావొచ్చని తెలిపారు.  కేంద్రం నిధులిస్తే … కేసీఆర్ దారి మళ్లించిండని  ఆరోపించారు. ఈరోజు వ్యాక్సిన్ ను ఉచితంగా మోదీ అందించడంవల్లే ఈరోజు అందరం కలిసి మాట్లాడుకోగలుతున్నామని గుర్తు చేశారు.

 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని  లంచ్ శిబిరం వద్ద సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సహా స్థానిక ప్రజా ప్రతినిధులను సంజయ్ ఘనంగా సన్మానించారు.   రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాయకుడైతే… గ్రామాలకు సర్పంచే నాయకుడు కావాలి. మండలానికి ఎంపీపీయే నాయకుడు కావాలని ఈ సందర్భంగా సంజయ్ స్పష్టం చేశారు. జిల్లాకు జడ్పీ ఛైర్మన్ నాయకుడు కావాలి, అంటే గ్రామ ప్రభుత్వం రావాలి, మండల ప్రభుత్వం రావాలి, జిల్లా ప్రభుత్వం రావాలని తెలిపారు.

బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరహాలో గ్రామ ప్రభుత్వాన్ని తీసుకొస్తామని సంజయ్ భరోసా ఇచ్చారు.  కేసీఆర్ పాలన ఉన్నంత కాలం గ్రామాలు బాగుపడవని స్పష్టం చేశారు. సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు విలువ ఉండదు.కేసీఆర్ పాలనలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే… ఎంతటి దుస్థితి ఉందో అర్ధం చేసుకోవాలని కోరారు.   

గ్రామాల్లో గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం రావాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి. .బిజెపి అధికారంలోకి రావాలని సంజయ్ పిలుపిచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండని కోరుతూ గడీల రాజ్యం పోవాలి. గరీబోళ్ల ప్రభుత్వం రావాలని స్పష్టం చేసారు. .

బండి సంజయ్ కు స్వల్ప అస్వస్థత

11 రోజులుగా మండు టెండలో పాదయాత్ర చేస్తుండటంతో  బండి సంజయ్ ఆదివారం  వడదెబ్బ,  ఎసిడిటీలతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.  పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద  డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో వైద్యులు  చికిత్స చేశారు.

పాదయాత్ర కు కొంత విరామం ఇవ్వాలని డాక్టర్లు సూచించినా,  పాదయాత్ర చేసేందుకే  సంజయ్ మొగ్గు చూపారు. అయితే వడదెబ్బతో కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన  ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  డాక్టర్ శరత్ చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో తగు చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి సాయంత్రం పాదయాత్ర ప్రారంభించారు.