
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, అమెరికా, ఐరోపా దేశాల్లో రష్యాపై కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధించడమే కాకుండా, ఇప్పటి వరకు 400 దిగ్గజ కంపెనీలు ఆ దేశంలో కార్యకలాపాల్ని నిలిపివేసినట్లు వార్తా కధనాలు వెలువడుతున్నాయి. యుద్ధం కారణంగా 2లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని మాస్కో మేయర్ ప్రకటించారు. బెదిరిపోని రష్యా, భారత్తో స్నేహం తమకు లాభిస్తోందనే ఆలోచనతో భారత్తో పాటు బ్రిక్స్ దేశాల భాగస్వామ్యంలో ఐటీ కంపెనీలను ఏర్పాటుకు సిద్ధమవుతున్నది.
రష్యాలో సెయింట్ పీటర్ బర్గ్ కేంద్రంగా రస్ సాఫ్ట్ అనే సంస్థ 261 ఐటీ కంపెనీలకు, అందులో పనిచేస్తున్న 85 వేల మంది ఉద్యోగులకు నాయకత్వం వహిస్తుంది. ఈ రస్ సాఫ్ట్ సంస్థ అధ్యక్షుడు వాలెంటిన్ మకరోవ్ మాట్లాడుతూ ఇటీవల భారత్లో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (బీజీబీఎస్)కు రష్యాకు చెందిన ఐటీ సంస్థలు, భారత్కు చెందిన పలు ఐటీ సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.
అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై విధిస్తున్న ఆంక్షల కారణంగా అనేక సవాళ్లతో పాటు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఆ ఇబ్బందుల వల్లే వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే అవకాశాల్ని అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నామని మకరోవ్ చెప్పారు. కాబట్టి, బ్రిక్స్ దేశాలతో పాటు ఐటీ రంగంలో అగ్రగామిగా అడుగులు వేస్తున్న భారత్ లో సంస్థల్ని నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు రస్సాఫ్ట్ ప్రతినిధి చెప్పారు.
“గత కొన్ని రోజులుగా, మా(రస్సాఫ్ట్) ప్రతినిధి బృందం అనేక భారతీయ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యింది. తమ భాగస్వామ్యంలో ఇక్కడ (భారత్లో) సంస్థల్ని ఏర్పాటు చేసేందుకు భారత్కు చెందిన 19 సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, టెలిమెడిసిన్, డిజిటల్ గవర్నెన్స్ వంటి రంగాల్లో సేవలందించే సంస్థలు ఎక్కువగా ఉన్నట్లు రస్ సాఫ్ట్ సహా మా నైపుణ్యాన్ని అందించగల అనేక రంగాలు ఉన్నాయి,” అని రస్ సాఫ్ట్ అధ్యక్షుడు వాలెంటిన్ మకరోవ్ వెల్లడించారు.
రస్ సాఫ్ట్ ప్రతినిధి బృందం, భారతీయ కంపెనీల మధ్య సత్సంబంధాలు నెరిపేందుకు బీజీబీఎస్ సులభతరం చేసిందని మకరోవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్యన్ ఐటీ కంపెనీలు సాంకేతిక నైపుణ్యంతో భారతీయ సంస్థలను ఎలా పెంచవచ్చో వివరించామని పేర్కొన్నారు.
పన్నులో రాయితీ ఇస్తూ ఆర్టీపీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందుబాటులో తీసుకొని రావడం, సాఫ్ట్వేర్ ద్వారా ట్రాఫిక్ మూవ్మెంట్స్ను ఆప్టిమైజ్ చేయడం, విద్యుత్ వినియోగాన్ని పొదుపు చేయడం, లాజిస్టిక్స్ కోసం సమాచార వ్యవస్థలపై పని చేయడంలో చాలా అవకాశాలు ఉన్నాయని మకరోవ్ వివరించారు.
అమెరికాతో పోటీపడే స్థాయికి భారత్ అడుగులు వేస్తుందని మకరోవ్ పేర్కొనడం గమనార్హం. అయితే తయారీ నాణ్యతలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని చెప్పారు.
“ప్రపంచ మార్కెట్లో ఇతర దేశాలకు గట్టి పోటీ ఇచ్చేలా భారత్కు సహాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. దాని కోసం కొత్త సాఫ్ట్వేర్ పరిజ్ఞానాన్ని అందుబాటులో తేవాలంటే భారతీయ మానవ వనరులను పొందడం మాకు అవసరం. కలిసి ఉత్పత్తులను తయారు చేయడం, ఇక్కడ, విదేశాలలో విక్రయించడం మా లక్ష్యం,” అని మకరోవ్ స్పష్టం చేశారు.
ఇక అంతర్జాతీయ వాణిజ్యం కోసం అమెరికన్ డాలర్పై ఆధారపడకుండా ఉండటానికి డిజిటల్ కరెన్సీ, రూపాయి-రూబుల్ చెల్లింపు వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తామని మకరోవ్ పునరుద్ఘాటించారు.
More Stories
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!
15 నెలల్లో తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. రూ. 1.52 లక్షల కోట్లు
214 బందీలను ఉరితీశామన్న బలూచ్ తీవ్రవాదులు