ఈ ఏడాది చివరికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు

ఈ ఏడాది చివరికి ప్రతిష్టాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు, సరికొత్త విస్తృత రక్షణ భాగస్వామ్య ప్రక్రియ అమలుకు భారత్ బ్రిటన్‌లు సంకల్పించాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడు రోజుల భారత్ పర్యటన ముగింపు రోజు శుక్రవారం భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం  విలేకరులతో మాట్లాడారు. 

భారత్ పట్ల బ్రిటన్‌కు సహజసిద్ధమైన మిత్రత్వం ఉందని జాన్సన్ తెలిపారు. తమ దేశం అసాధారణ రీతిలో భారత్‌కు బహిరంగ సార్వత్రిక ఎగుమతుల అనుమతి (ఓజెల్)ను లైసెన్సు రూపంలో కల్పించే దిశలో తమ దేశం ఆలోచిస్తోందని జాన్సన్ చెప్పారు. దీనివల్ల రక్షణ సంబంధిత పంపిణీలు వేగవంతం అవుతాయి. సాధారణ బ్యూరోక్రసీ నివారణ, పంపిణీ గడువుల కుదింపునకు వీలేర్పడుతుందని బ్రిటన్ ప్రధాని తెలిపారు. 

ప్రధాని మోదీ  తనకు ఖాస్ దోస్తు (ప్రత్యేక స్నేహితుడు) అని జాన్సన్ కొనియాడారు. భారత్‌కు తమ దేశం నుంచి సరికొత్త ఫైటర్ జెట్ టెక్నాలజీని అందిస్తామని వెల్లడించారు. దీనితో గగనతలంలో భద్రతకు వీలేర్పడుతుంది. ఇక సముద్ర మార్గాల ద్వారా వచ్చే ముప్పును తట్టుకునేందుకు సకాలంలో వీటిని పసికట్టి దెబ్బతీసేందుకు వీలైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చడం జరుగుతుంది.

అక్టోబర్ చివరికి అంటే భారతీయులకు ఇష్టమైన దివాళీకి ముందే ఖరారు చేస్తారని భావిస్తున్నట్లు జాన్సన్ తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ కూడా ఆశాభావంతో స్పందిస్తూ   ఇరు పక్షాలూ ఈ ఒప్పందాన్ని అంతిమంగా ఈ ఏడాది చివరికి ఖరారు చేసుకుని తీరాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

రక్షణ భద్రత రంగాలకు పూర్తి సాయం అందించడం దీనికి తోడుగా భారత్ రక్షణ స్వయం సమృద్ధి, సంబంధిత రక్షణ ఉత్పత్తుల రంగంలో ఆత్మనిర్భరతకు అంటే ఉత్పత్తి, సాంకేతికత, నమూనాలు, రూపకల్పనల్లో కూడా భారతదేశ స్వయంసమృద్ధికి సాయం అందించేందుకు బ్రిటన్ ముందుకు వచ్చిందని ఇది ఎంతో అభినందించదగ్గ విషయం అన్నారు.

 కాగా,ఇప్పటి రగులుకున్న ఉక్రెయిన్ యుద్ధ సమస్య పరిష్కారం కేవలం సంప్రదింపులు దౌత్య ప్రక్రియతోనే సాధ్యం అవుతుందని ప్రధాని మోదీ మరోమారు స్పష్టం చేశారు. ముందుగా ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ జరగాలని పిలుపు నిచ్చారు. ఇక్కడనే కాదు ఏ దేశపు ప్రాంతీయ భౌగోళిక ప్రాదేశిక సమగ్రతల పరిరక్షణ కీలకమైన విషయం అని ఆయన తెలిపారు.

గుజరాత్ పర్యటన తనకు అమితానందం కల్గించిందని తనకు తాను అమితాబ్ బచ్చన్ లేదా సచిన్ టెండూల్కర్ అన్పించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతసించారు. సబర్మతిలో పలు చోట్ల తన భారీ కటౌట్లు గానా బజానాలు చూసి ఉప్పొంగిపొయ్యానని చెబుతూ  మీరు చూసే ఉంటారు బుల్‌డోజర్ల కంపెనీలో తాను బుల్‌డోజర్‌పైకి దూకేశానని, భారత్‌లో ఆతిధ్యం ఇంత గొప్పగా ఉంటుందని తాను అనుకోలేదని పేర్కొన్నారు.

ఇలా ఉండగా, బ్రిటన్ గడ్డపై ఉంటూ, ఇతర దేశాలను బెదిరించే ఉగ్రవాద సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదనేది తమ బలమైన దృక్పథమని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. భారత దేశాన్ని, ఇతర దేశాలను బెదిరించే ఉగ్రవాద సంస్థల పట్ల తమకు బలమైన దృక్పథం ఉందని ఆయన చెప్పారు. భారత దేశానికి సహాయపడేందుకు తాము యాంటీ ఎక్స్‌ట్రీమిస్ట్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 
 
భారత టీకా బాగా పని చేసింది 
‘‘నా చేతికి భారత కరోనా టీకా వేయించుకున్నాను. అది నాకు మేలు చేసింది. భారత దేశానికి చాలా ధన్యవాదాలు’’ అని బోరిస్ జాన్సన్ చెప్పారు.  భారత్-బ్రిటన్ మధ్య వ్యాక్సిన్ల భాగస్వామ్య ఒప్పందం ఉంది. 2021 మే నెలలో మోదీ, జాన్సన్ మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో ఇరు దేశాలు ఈ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడానికి అంగీకారించారు.
కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడానికి భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ఉత్పత్తి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల దాదాపు 100 కోట్ల మందికి ప్రయోజనం కలిగింది.