ఉగ్రవాదులు భారీగా పేలుడు పదార్థాలున్న జాకెట్ను ధరించారని డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. వారి వద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించిందన్నారు. భారీగా నష్టం కలిగించి, ప్రధాని పర్యటనకు అవాంతరం కలిగించేందుకు జైషే కుట్ర పన్నినట్లు తెలుస్తోందన్నారు. సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పిందని చెప్పారు.
సంఘటన ప్రాంతంలో రెండు ఏకే–47 రైఫిళ్లు, గ్రెనేడ్ లాంఛర్, శాటిలైట్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇదే ఆర్మీ క్యాంప్పై 2018లో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు.
మరోవంక, బారాముల్లా జిల్లాలో మాల్వాలో గురువారం నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో నాలుగో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. సుదీర్ఘకాలంగా కశ్మీర్లో పలు ఉగ్రదాడులకు కారకుడైన లష్కరే టాప్ కమాండర్ యూసుఫ్ కట్రూతోపాటు ముగ్గురు ఉగ్రవాదులు గురువారం హతమైన విషయం తెలిసిందే.
ఇలా ఉండగా, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న కశ్మీర్లోని సాంబ జిల్లా పాలి గ్రామాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. 2019లో కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
సాంబ, పరిసరాల్లో మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హై అలర్ట్ ప్రకటించారు. మోదీ పాల్గొనే సభా ప్రాంతానికి చేరుకునే మార్గాల్లో చెక్పాయింట్లు పెట్టారు. అత్యాధునిక నిఘా వ్యవస్థను నెలకొల్పినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
More Stories
ఎన్నికల వేళ అయోధ్యలో మోదీ రామయ్య దర్శనం
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
ఏపీ డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు