దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జహంగీర్పురి ఘర్షణ అంతర్జాతీయ కుట్రలో భాగమని బీజేపీ నేత, వాయువ్య ఢిల్లీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్ ఆరోపించారు. భారత్ను అప్రతిష్ఠపాలు చేయడమే విదేశీ శక్తుల లక్ష్యమని అన్నారు. దేశంలో నివసిస్తున్న కొంతమంది వ్యక్తులు విదేశీ శక్తులకు సాయమందిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
‘ఇది ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర. భారత్ను అపకీర్తిపాలుచేయడమే వారి లక్ష్యం. ఈ ఘటన విషయంలో ఏ మతాన్నీ నిందించలేం. ఈ ఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలి’ అని డిమాండ్ చేశారు. కాగా ఎంపీ హన్స్ రాజ్ వాయువ్య ఢిల్లీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు ఘటన ప్రాంతాన్ని ఢిల్లీ బీజేపీ నేతలు అదేష్ గుప్తా, రామ్వీర్ సింగ్ బిధురి సందర్శించారు.
కాగా, జహంగీర్పూరిలో జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి 20 మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ దేపేంద్ర పాఠక్ తెలిపారు. అయితే అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండడంతో వారిని జూవైనల్ హౌస్కు పంపినట్లు ఆదివారం ఆయన తెలిపారు.
అలాగే మూడు దేశీయ తుపాకులు, ఐదు తల్వార్లు సీజ్ చేసినట్లు వారు తెలిపారు. అరెస్ట్ చేసిన అనంతరమే వారిని ఢిల్లీలోని రోహిణి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఘర్షణ జరిగిన ప్రాంతంలో పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని పోలీసులు తెలిపారు. తగిన స్థాయిలో పోలీసు బలగాలను మోహరించినట్టు చెప్పారు.
పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, శాంతిభద్రతల నిర్వహణలో ఎలాంటి ఢోకా ఉండదని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ ఘటనపై సవ్యమైన దిశలో దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా శనివారం రాత్రి హనుమాన్ జయంతి శోభాయాత్రలో ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలకు చెందినవారు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. మొత్తం 14 మంది గాయాలపాలయ్యారు. బాధితుల్లో పోలీసుల సంఖ్యే అధికంగా ఉన్నారు.
More Stories
దక్షణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్
కోవాగ్జిన్ తీసుకున్న 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు