ఆఫ్ఘన్ లో పాక్ వైమానిక దాడుల్లో పిల్లలు సహా 40 మంది మృతి

ఆఫ్ఘానిస్థాన్ లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులలోని వివిధ ప్రాంతాలలో శుక్రవారం రాత్రి  పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించడంతో పిల్లలు సహా 40 మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్  స్వతంత్ర శాంతి పర్యవేక్షణ సంస్థ అయిన ‘ఆఫ్ఘన్ పీస్ వాచ్’ వ్యవస్థాపకుడు హబీబ్ ఖాన్ తెలిపారు.

ఈ ఘటనను ట్విటర్‌లో ఖండిస్తూ ఖాన్, “మొట్టమొదటిసారిగా, పాకిస్తాన్ సైనిక విమానాలు ఆఫ్ఘన్ గడ్డపై తాలిబాన్ ఆధ్వర్యంలో బాంబు దాడి చేసి 40 మందికి పైగా పౌరులను చంపాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ తన ప్రాక్సీ దళాలైన తాలిబాన్ మరియు ముజాహిదీన్ల ద్వారా ఆఫ్ఘన్‌లను చంపుతోంది” అని పేర్కొన్నారు.

ఈ ఘటనలో మరణించిన వ్యక్తుల శవాల చిత్రాన్ని కూడా ఖాన్  పంచుకున్నారు.  ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ యుద్ధ నేరాలను గమనించాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ , అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు పిలుపునిచ్చారు. ఇదిలావుండగా ఖోస్ట్, కునార్ ప్రావిన్సులకు చెందిన స్థానిక అధికారులు శనివారం నాడు పాక్ విమానం ప్రావిన్స్‌లోని వివిధ ప్రాంతాలపై వైమానిక దాడులు ప్రారంభించినట్లు ధృవీకరించారు.

ఈ సంఘటన తరువాత, తాలిబాన్ అధికారులు పాకిస్తాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌ను పిలిపించి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆందోళనలను తెలియజేశారు. దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ తాత్కాలిక మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ, తాత్కాలిక డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ అల్హాజ్ ముల్లా షిరిన్ అఖుంద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

“కాబూల్‌లోని పాక్ రాయబారిని ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించారు. విదేశాంగ మంత్రి మవ్లావి అమీర్ ఖాన్ ముత్తాకీతో పాటు, సెషన్‌లో డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ అల్హాజ్ ముల్లా షిరిన్ అఖుండ్ కూడా ఉన్నారు. వారు పాకిస్థాన్ దళాల దాడులను ఖండించారు” అని ట్వీట్ చేసింది.

ఈ దాడులు పాకిస్తాన్ ప్రత్యక్ష జోక్యం, ఆఫ్ఘన్ జాతీయ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడినట్లు టోలోన్యూస్ పేర్కొంది. కాగా “ఖోస్ట్ , కునార్‌లో (డ్యూరాండ్ లైన్)తో పాటు పాకిస్తాన్ దళాలు జరిపిన వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్‌లు ఆఫ్ఘన్ గగనతలం, భూభాగంలో స్పష్టమైన ఉల్లంఘన మరియు జోక్యం” అని రాజకీయ విశ్లేషకుడు సాడెక్ షిన్వారీని ఉటంకిస్తూ మీడియా పేర్కొంది.