ఏపీ విభజనపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు 

2014 నాటి  ఆంధ్రప్రదేశ్‌ విభజనకి సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు సభల్లోనూ వివాదాస్పద తీరులో ఆమోదించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
పిటిషన్‌లోని కీలక అంశాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌ విభజనను సవాల్‌ చేసే సమయం కొద్దికాలానికి పనికిరానిదిగా మారినప్పటికీ,  ఇతర ముఖ్యమైన అంశాలపై విచారణ చేపట్టాల్సి వుందని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ పేర్కొన్నారు. ఇతర అంశాలను ఒకరోజు జాబితా చేయాలని, త్వరలో విచారణ చేపడతామని జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమ కొహ్లిలు తెలిపారు. 
 
చట్ట ప్రకారం 2014లో ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలంగాణ విభజించబడిన సంగతి తెలిసిందే. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్యసభలో ఆమోదం పొందగా, మార్చి 1న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం పొందింది. . మరుసటి రోజు అధికారిక గెజిట్‌లో ప్రచురితమైంది. 
 
విభజనను సవాల్‌ చేస్తూ ఎపి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పిటిషన్‌ వేయగా, పార్లమెంటులో బిల్లును ఆమోదించిన వివాదాస్పద విదానాన్ని సవాలు చేస్తూ 2014లో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. అవి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఎపి విభజన చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని ఆ పిటిషన్‌లలో పేర్కొన్నారు.