కర్ణాటకలో గంటలోనే వాహనాల రిజిస్ట్రేషన్

కర్ణాటకలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సరికొత్త ఆన్‌లైన్‌ విధానం త్వరలోనే అమలులోకి రానుంది. ఇకపై ఆన్‌లైన్‌ ద్వారానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు రవాణాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. 

గతంలో వాహనం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్‌ నెంబరు కోసం రోజులకొద్దీ పడిగాపులు పడాల్సి వచ్చేది. ఒక్కోసారి నెల దాటినా నెంబరు వచ్చేది కాదు. అందుబాటులో ఉన్న సాంకేతికతను గరిష్టస్థాయిలో వినియోగించుకుని వాహనం కొనుగోలు చేసిన గంటలోనే రిజిస్ట్రేషన్‌ నెంబరు అందించేలా రవాణాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. 
 
రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను ఈ నూతన విధానం తగ్గించనుంది. మొత్తం వ్యవహారం ఆన్‌లైన్‌ కావడంతో దళారుల ఆగడాలకు బ్రేక్‌ పడనుందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే వీటిని తక్షణం పరిశీలించి కేటగిరీల వారీగా రిజిస్ట్రేషన్‌ నెంబర్లను కేటాయిస్తారు. 
 
అలాగే ఇంటి ముంగిటకే డీఎల్‌, ఆర్‌సీలను కూడా అందచేసే దిశలో చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 25 లక్షల కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ జరుగుతోందన్నారు. 
 
ఫ్యాన్సీ నెంబర్లు, వాటి చార్జీల వివరాలు కూడా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచుతున్నామని, ఎంపిక చేసుకునే అధికారాన్ని వాహనదారులకు కల్పిస్తున్నామని రవాణాశాఖ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్‌ కఠారియా వెల్లడించారు. ఈ వ్యవస్థ విజయవంతంగా అమలయ్యే దిశలో సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.