ముంబై పేలుళ్ల సూత్రధారి,లష్కరే తోయిబా (ఎల్ఈటీ) చీఫ్, 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్కు పాకిస్థాన్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు శుక్రవారం 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నివేదికల ప్రకారం, సయీద్కు మరో రెండు ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో శిక్ష పడింది. అతడి ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఇంతకుముందు ఇలాంటి ఐదు కేసుల్లో, 70 ఏళ్ల ఈ రాడికల్ మత గురువుకు ఇప్పటికే 36 ఏళ్ల జైలు శిక్ష పడింది. పంజాబ్ పోలీసుల ఉగ్రవాద నిరోధక విభాగం నమోదు చేసిన 21/2019, 90/2019 అనే రెండు ఎఫ్ఐఆర్లలో సయీద్కు యాంటీ టెర్రరిజం కోర్టు (ఏటీసీ) న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ భుట్టర్ 32 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
“21/19, 99 /21లో, అతనికి వరుసగా 15.5 సంవత్సరాలు, 16.5 సంవత్సరాలు శిక్ష విధించబడింది” అని ఓ అధికారి తెలిపారు. సయీద్కు కోర్టు పాకిస్థాన్ రూ. 340,000 జరిమానా విధించింది.2019 నుంచి కట్టుదిట్టమైన భద్రతలో జైలు శిక్ష అనుభవిస్తున్న సయీద్ను లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చినట్లు ఆ అధికారి తెలిపారు.
సయీద్ను అమెరికా ప్రత్యేకించి గ్లోబల్ టెర్రరిస్ట్గా పేర్కొంది. అతను డిసెంబర్ 2008లో ఐక్యరాజ్య భద్రతా మండలి తీర్మానం 1267 కింద కూడా దోషే. 2008లో సంభవించిన ముంబై బాంబు పేలుళ్లకు జేయూడీకి చెందిన లష్కరే తోయిబా సూత్రధారిగా ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన హఫీజ్పై అమెరికా ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది.
ఇండియాకు చెందిన ఎన్ఐఏ మోస్టు వాంటెడ్ జాబితాలో ఉన్న హఫీజ్ సయీద్ పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలోని సర్గోధాలో 1950 జూన్ 5న జన్మించాడు. తొలుత మత గురువుగా పనిచేశాడు. తర్వాత ఉగ్రబాట పట్టాడు. ఐక్యరాజ్యసమితి కూడా అతడిని ఉగ్రవాదిగా అధికారికంగా గుర్తించింది.
More Stories
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
భారత్ తో వాణిజ్య సంబంధాలకై పాక్ ప్రధానిపై వత్తిడి