హైదరాబాద్‌-విజయవాడ మధ్య ‘ఆరు లేన్లు’

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ మే మొదటి వారంలో ప్రారంభమవుతుందని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రహదారిని ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చే అంశంపై విజయవాడ ఎంపి కేశినేని నానితో కలిసి కోమటిరెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ భేటీలో జీఎంఆర్ ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. 

రహదారి విస్తరణలో గుత్తేదారుల సమస్య, డిజైనింగ్‌లో సాంకేతిక లోపాలపై ఎంపిలు కేంద్రమంత్రికి వివరించారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్- టు విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే నెలలోనే పనులు ప్రారంభించాలని జీఎంఆర్ సంస్థకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

వీటితో పాటు పలు అంశాలను ఎంపి కోమటిరెడ్డి చర్చించారు. నెలలోగా సమస్యలన్నీ పరిష్కరించి మేలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని ఎంపి కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపిలతో పాటు కేంద్ర రవాణా, రహదారుల సహాయ మంత్రి జనరల్ వికె సింగ్, ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ, ఎన్‌హెచ్‌ఐ అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లు, ఎక్స్‌ప్రెస్ హైవేగా విస్తరించడం ఎన్‌హెచ్ 30 ఇబ్రహీంపట్నం- టు అమరావతి కనెక్టివిటీ కల్పించడం. విజయవాడ- టు నాగపూర్ కొత్త ఎక్స్‌ప్రెస్ హైవే. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డులను వెడల్పు చేయడం. మహానాడు రోడ్డు, రామవరపాడు, ఎనికేపాడు టీ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్‌ల నిర్మాణం. విస్సన్నపేట గ్రామానికి బైపాస్ నిర్మించడం. విజయవాడ నగరానికి కొత్త తూర్పు బైపాస్ నిర్మించడం. గొల్లపూడి బైపాస్ నిర్మాణం పనులు వేగవంతం చేయడంపై కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ఎంపిలతో పాటు జిఎంఆర్ ప్రతినిధులతో చర్చించారు.

హైవేలో ఉండాల్సిన డిజైన్ లేదు, దాని వల్ల రాంగ్‌రూట్‌లో వచ్చి చనిపోతున్నారు. ఇవన్నీ కేంద్రమంత్రితో చర్చించాం. దీనిపై కేంద్రమంత్రి గడ్కరీ స్పందించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ మే మొదటి వారంలోనే ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి హామినిచ్చారని చెబుతూ ఈ సమస్యను పరిష్కరిస్తున్నందుకు కేంద్రమంత్రికి ఎంపి ధన్యవాదాలు తెలిపారు.

ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌-విజయవాడ ఆరు లేన్ల పనులను ఏప్రిల్‌లో జీఎంఆర్‌ సంస్థ మొదలుపెట్టాలని, కానీ పనులు చేయలేమంటూ ఆ సంస్థ ఆర్బిట్రేషన్‌కు వెళ్లడం వల్ల వివాదం మొదలైందని వెంకటరెడ్డి తెలిపారు. ఎన్‌హెచ్‌ఏఐ ఇచ్చిన రూ. 950 కోట్లను జీఎంఆర్‌ సంస్థ బ్యాంకు ఖాతాలో జమ చేసుకుందని చెప్పారు. ఈ అంశంపై తాను కొంతకాలంగా కేంద్రంతో చర్చిస్తున్నానని, సమస్యలు పరిష్కరించి మే నెలలో పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సమావేశంలో తెలిపారని వెంకటరెడ్డి వెల్లడించారు.

అలాగే, చౌటుప్పల్‌, చిట్యాల, టేకుమట్ల, సూర్యాపేటలలో ఫైఓవర్లను నిర్మించాలని విజ్ఞప్తి చేశామని ఆయన పేర్కొన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలో ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ రహదారికి సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని అభ్యర్థించామని చెప్పారు.