ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన దాదాపు రూ.19,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను తెలిపారు.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తమ సంస్థల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసగించారని పంకజ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వీరు రూ.22,585.83 కోట్ల మేరకు బ్యాంకులను మోసగించారని చెప్పారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం వీరి నుంచి 2022 మార్చి 15 వరకు రూ.19,111.20 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు.
జప్తు చేసిన ఆస్తుల నుంచి రూ.15,113.91 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి అప్పగించినట్లు తెలిపారు. రూ.335.06 కోట్ల విలువైన ఆస్తులను భారత ప్రభుత్వానికి స్వాధీనం చేసినట్లు చెప్పారు. ఈ ముగ్గురూ మోసగించిన ఆస్తుల్లో 84.61 శాతం ఆస్తులను 2022 మార్చి 15 వరకు జప్తు/స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
బ్యాంకులకు జరిగిన నష్టంలో 66.91 శాతం విలువైన ఆస్తులను తిరిగి బ్యాంకులకు/భారత ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు. భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియంకు అప్పగించిన ఆస్తుల అమ్మకం ద్వారా రూ.7,975.27 కోట్లు వచ్చిందని తెలిపారు. ఈ ఆస్తులను ఈ కన్సార్షియంకు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అప్పగించినట్లు తెలిపారు. ఈ సొమ్మును ఈ కన్సార్షియం స్వీకరించినట్లు తెలిపారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002; ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్, 2018 ప్రకారం మనీలాండరింగ్లో చిక్కుకున్న ఆస్తులను రుణాలిచ్చిన బ్యాంకులు సహా చట్టబద్ధమైన మూడో పక్షానికి అప్పగించే అధికారం న్యాయస్థానానికి ఉంది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల కేసులకు కూడా ఈ చట్టాలు వర్తిస్తున్నాయి.
More Stories
చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్పింగ్
ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్టీ వసూళ్లు
బాబా రాందేవ్కు సుప్రీంకోర్టు ప్రశంసలు