నేడే జపాన్ ప్రధాని కిషిడా రెండు రోజుల పర్యటనకు రాక

జ‌పాన్ ప్ర‌ధాన మంత్రి ఫుమియో కిషిడా, భార‌త ప్ర‌ధాని మంత్రి నరేంద్ర మోదీ  కీల‌క భేటీ కానున్నారు. ఇరు దేశాల మ‌ధ్య‌ శిఖరాగ్ర సదస్సు నేటీ నుంచి ప్రారంభం కానున్న‌ది. ఇందులో భాగంగా.. జపాన్ ప్రధాని భార‌త్ కు రానున్నారు. మార్చి 19,20 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. శనివారం శిఖరాగ్ర చర్చలు జరుపనున్నారు.

ఈ సందర్భంగా భారత్ లో వచ్చే ఏడేళ్లలో 5 ట్రిలియన్ యాన్ లు (42 బిలియన్ డాలర్ల) పెట్టుబడులను జపాన్ ప్రధాని ప్రకటించగలరని భావిస్తున్నారు. 2014లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటన సందర్భంగా ప్రకటించిన 3.5 ట్రిలియన్ యాన్ లకు అదనంగా ఈ పెట్టుబడులు ఉండనున్నాయి. గత ఏడాది అక్టోబర్ 4న జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కిషిడా మొదటిసారి భారత్ పర్యటనకు వస్తున్నారు. ఇద్దరు ప్రధానులు కలవడం కూడా ఇదే మొదటిసారి.

ఒకవంక ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో తొలిసారిగా భారత ప్రధాని ఒక ప్రధాన దేశాధినేతతో సమావేశం అవుతున్నారు. వీరిద్దరూ సమావేశం కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. వీరి చర్చలలో ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై విధించిన ఆర్ధిక ఆంక్షలు, పర్యవసానాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది

ఇరు దేశాల‌ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం సహకారం గురించి ఇద్దరు నేతలు మాట్లాడతారని భావిస్తున్నారు. 14వ ఇండియా-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జ‌పాన్ ప్ర‌ధాని రెండు రోజుల పాటు భారతదేశంలో అధికారంగా పర్యటించనున్నారు.

జపాన్ ప్రధాని పర్యటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. భారత్-జపాన్ ల‌ శిఖరాగ్ర సమావేశం మార్చి 19,20 న జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ  ఆహ్వానం మేరకు.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భార‌త్ కు వస్తున్నారు. 14వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం లో భాగంగా మార్చి 19 నుంచి మార్చి 20 వరకు న్యూఢిల్లీలో అధికారిక పర్య‌టించ‌నున్నారు.

ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించేందుకు, మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ సదస్సు ఇరుపక్షాలకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ఇండో పసిఫిక్ శాంతి సుస్థిరత, శ్రేయస్సు కోసం భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరుపక్షాలకు అవకాశాన్ని అందిస్తుందని బాగ్చి చెప్పాడు