భారత్ లో రూ.3.2లక్షల కోట్ల జపాన్ పెట్టుబడులు

భారతదేశంలో భారీ స్థాయి పెట్టుబడులకు జపాన్ ముందుకు వచ్చింది. వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశంలో 42 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను లక్షంగా పెట్టుకుంటున్నట్లు జపాన్ భారత్‌కు తెలిపింది. ఇది భారతీయ కరెన్సీలో రూ 3,20,000 కోట్లుగా ఉంటుంది. 

శనివారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ప్యూమియో కిషిడా మధ్య న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జపాన్ నుంచి భారత్‌కు అత్యంత కీలకమైన స్నేహ హస్తం అందింది. భారత్‌లో వచ్చే ఐదేళ్ల కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకర రీతిలో 5 ట్రిలియన్ యెన్‌లు (జపాన్ కరెన్సీ) లేదా 3.2 లక్షల కోట్లు లేదా 42 బిలియన్ డాలర్ల మేర విలువైన పెట్టుబడులకు జపాన్ ముందుకు వచ్చిందని, ఈ మేరకు ప్రధాని ఫ్యూమియోతో జరిపిన భేటీ సందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ప్రధాని ఆ తరువాత విలేకరులకు తెలిపారు.

అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి ప్రధాని ఫ్యూమియో 14వ ఇండియా జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి మధ్యాహ్నం తరలివచ్చారు. జపాన్ ప్రధానిగా అధికార బాధ్యతల స్వీకరణ తరువాత తొలిసారిగా జపాన్ నేత భారతదేశానికి వచ్చారు. జపాన్ ప్రధానిగా మరో దేశంతో ద్వైపాక్షిక చర్చలు జరపడం కూడా ఆయనకు ఇదే ప్రధమం. గతంలో జపాన్ విదేశాంగ మంత్రిగా పలుసార్లు ప్రధాని మోదీని కలిశారు. భారత్ లో కూడా పర్యటించారు.

ఉన్నత స్థాయిలో సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్త పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. భద్రతాయుత, విశ్వసనీయ, కాలాతీతమైన సుస్థిర ఇంధన సరఫరా అత్యవసరం అనే విషయాన్ని ఇరుదేశాలు గుర్తించినట్లు ప్రధాని తెలిపారు. భారతదేశపు పట్టణ మౌలిక సాధనాసంపత్తికి పూర్తి స్థాయి మద్ధతు ఇవ్వడం జపాన్ లక్షం అని ఆ దేశానికి చెందిన ప్రతినిధి బృందం తెలిపింది.

తమ దేశపు ప్రతిష్టాత్మక బుల్లెటు ట్రైన్ టెక్నాలజీని సాధనంగా చేసుకుని ఏర్పాటు చేసే హై స్పీడ్ రైల్వే వ్యవస్థకు జపాన్ తోడ్పాటు ఉంటుందని జపాన్ ప్రధాని తెలిపారు. ఇప్పటి భేటీలో భాగంగా ఇరువురు నేతలు జరిపిన సమీక్ష ఫలితంగా ఆరు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పలు రంగాలలో పరస్పర సాయం, ప్రత్యేకించి స్వచ్ఛ ఇంధన భాగస్వామ్య విస్తరణపై కూడా అంగీకారం కుదిరింది.

అంతకుముందు ఇరువురు నేతలు ఇక్కడి హైదరాబాద్ హౌస్‌లో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక అనుసంధానం దిశలో భాగంగా ఇరువురు నేతలు సమీక్ష జరిపారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. 2021లో జపాన్ ప్రధానిగా కిషిడా అధికారంలోకి రాగానే ఆయనను అభినందిస్తూ ప్రధాని మోదీ  ఫోన్‌లో మాట్లాడారు.

ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను, ప్రపంచస్థాయిలో భాగస్వామ్యపక్షాన్ని మరింతగా విస్తృత పరచుకోవాలని ఆ దశలోనే ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చారు. భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు నెలకొని ఈ ఏడాదితో 70 ఏళ్లు అవుతాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిపై కూడా జపాన్ , భారత్ ప్రధాన మంత్రులు సమీక్షించారు.

ప్రపంచ యుధాతథస్థితిని బలప్రయోగంతో మార్చే అనుమతిని అవకాశాన్ని ప్రపంచంలోని ఏ పక్షానికి ఇవ్వలేమని ఇవ్వరాదని జపాన్ ప్రధాని కిషిడా స్పష్టం చేశారు. భారత ప్రధానితో ద్వైపాక్షిక భేటీ తరువాత సంయుక్త విలేకరుల సమావేశంలో మోడీతో పాటు ఆయన మాట్లాడారు. రష్యా ఆధిపత్య ధోరణిని ఖండించారు. తమ దేశం ఉక్రెయిన్‌కు సాయం కొనసాగిస్తుందని తెలిపారు. ఉక్రెయిన్‌కు సంఘీభావం, సాయం గురించి జపాన్ నేత మాట్లాడుతున్నప్పుడు ఈ అంశంపై ప్రధాని మోడీ స్పందించలేదు. మౌనంగానే నిలిచారు.

ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ చర్యలతో అమానుష పరిస్థితి ఏర్పడుతోందని, ఈ తూర్పు యూరోపియన్ దేశంపై రష్యా పంజా ఆసియా దేశాలపై ప్రభావం చూపుతోందని జపాన్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా, శాంతి మౌలిక వ్యవస్థను దెబ్బతీస్తూ రష్యా చర్యలు ఉన్నాయని జపాన్ ప్రధాని విమర్శించారు.