విద్యా కాషాయీకరణ చర్యలను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సమర్థించారు. హరిద్వార్లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్ను ఆయన ప్రారంభిస్తూ విద్యా కాషాయీకరణ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, అయితే అందులో తప్పేమిటో తనకు అర్థంకావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
బ్రిటీష్ కాలం నాటి వలసవాద భావజాలాన్ని భారతీయులు విడనాడాలని ఆయన హితవు చెప్పారు. భారతీయీకరణే కేంద్రంగా నూతన విద్యా విధానాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. మాతృభాషలకు ఇందులో పెద్ద పీఠ వేశారని గుర్తు చేశారు. విద్యా రంగంలో టిబి మేకాలే (బ్రిటీష్ చరిత్రకారుడు. భారత్లో ఆంగ్ల మాద్యమానికి ఆద్యుడు) వ్యవస్థకు స్వస్థి పలకాలని వెంకయ్యనాయుడు కోరారు.
దేశంలోని ప్రజలు తమ ‘వలసవాద మనస్తత్వాన్ని’ విడిచిపెట్టి, తాము భారతీయులం అని గర్వపడటం నేర్చుకోవాలని కోరారు. దేశంలో విద్యా మాధ్యమంగా.. విదేశీ భాషను విధించి ఉన్నత వర్గాలకే విద్యను పరిమితం చేశారని ఆరోపించారు. ఆ విద్యా విధానం మనల్ని మనం తక్కువ జాతిగా చూసుకోవడం నేర్పింది. మన స్వంత సంస్కృతిని, సంప్రదాయ వివేకాన్ని తృణీకరించేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశీయంగా కూడా మన ఎదుగుదలను మందగించేలా చేసిందని చెబుతూ ఈ విద్యా విధానానికి సంబంధించిన విద్యను కొంతమందికే పరిమితం చేసిందని, దీని వల్ల అధిక జనాభా విద్యాహక్కును కోల్పోతోందని తెలిపారు. మన వారసత్వం, మన సంస్కృతి, మన పూర్వీకుల గురించి మనం గర్వపడటమే కాక మనం మన మూలాల్లోకి తిరిగి వెళ్లాలని వెంకయ్యనాయుడు సూచించారు.
మనం అనేక భారతీయ భాషలను నేర్చుకోవడమే కాక మాతృభాషను ప్రేమించాలని ఆయన తెలిపారు. జ్ఞాననిధి అయిన మన గ్రంధాలను తెలుసుకోవాలంటే సంస్కృతం నేర్చుకోవాలని చెప్పారు. అన్ని గ్యాడ్జెట్ నోటిఫికేషన్లు సంబంధిత రాష్ట్ర మాతృభాషలో విడుదలయ్యే రోజుకోసం తాను ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
మీ మాతృభాష మీ కంటి చూపు లాంటిదని విదేశీ భాషపై ఉన్న జ్ఞానం మీ కళ్లద్దాలు లాగా ఉండాలని అభివర్ణించారు. భారతదేశ నూతన విద్యా విధానానికి భారతీయకరణ ప్రధానమైనదని మాతృభాషల ప్రోత్సాహానికీ అధిక ప్రాధాన్యతనిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు.
గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాల సిలబస్లో భాగంగా భగవద్గీతను ప్రవేశపెడతామని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు విద్యను కాషాయికరణం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డాయి.
దీంతో వెంక్యనాయుడు బీజేపీ అన్నదాంట్లో తప్పేముందంటూ గట్టి కౌంటరిచ్చారు. మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న తత్వాలైన సర్వే భవంతు సుఖినాః (అందరూ సంతోషంగా ఉండండి) , వసుధైవ్ కుటుంబకం (ప్రపంచం ఒకే కుటుంబం) వంటివి నేటికీ మన విదేశాంగ విధానానికి మార్గదర్శకాలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
More Stories
స్వాతి మలివాల్పై దాడి గురించి కేజ్రీవాల్ దాటవేత
‘అధిక సంతానం’ ముస్లింల గురించి కాదు.. పేదల గురించి
2029 వరకు ప్రధానిగా నరేంద్ర మోదీ