రష్యా ఆయిల్ కొనుగోలు పట్ల భారత కంపెనీల ఆసక్తి!

భారత ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు రష్యా చమురు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలను విధించాయి. ఈ క్లిష్ల పరిస్థితుల నేపథ్యంలో రష్యా చమురును పలు పాశ్చత్య దేశాలు కొనడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో చాలా దేశాలు రష్యా ముడి చమురు దిగుమతులకు స్వస్తి పలికాయి. 

ఈ క్రమంలో భారత్‌ లాంటి దేశాలకు రష్యా తన ముడి చమురుపై రాయితీ ప్రకటించింది. మార్కెట్‌ కంటే తక్కువ ధరకే చమురును సరఫరా చేస్తామని ఆఫర్‌ ఇచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భారత పిఎస్‌యులు భావిస్తున్నాయని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వర్గాలు తెలిపాయి. దీనిపై ఒక్కటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. 

ఈ లావాదేవీలు సరళంగా జరగడానికి భారత, రష్యా అధికారులు, బ్యాంకర్లు, కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు తీవ్ర కసరత్తులో ఉన్నారు. ఇదే విషయంలో చమురు కంపెనీలు, బ్యాంకర్లు సులభ చెల్లింపుల కోసం ఆర్‌బిఐ అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ప్రస్తుతం రష్యా నుంచి సరఫరాకు ఓడల కొరత కూడా నెలకొంది. దీని పరిష్కారంపై కూడా అధికారులు దృష్టి పెడుతున్నారు.

కాగా, దేశంలోని అగ్రశ్రేణి చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) రష్యా ప్రస్తుత అంతర్జాతీయ ధరలకు తగ్గింపుతో ఆఫర్ చేసిన 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత, పుతిన్ పరిపాలనను వేరుచేయడం కోసం అంతర్జాతీయ ఒత్తిడి తెచ్చిన తర్వాత ఒక వ్యాపారి ద్వారా కొనుగోలు చేయడం ఇదే తొలిసారి.

మే లో డెలివరీ కోసం ఐఓసి యురల్స్ క్రూడ్‌ను డేటెడ్ బ్రెంట్‌కు బ్యారెల్ 20-25 డాలర్ల తగ్గింపుతో కొనుగోలు చేసిందని ఈ విషయం గురించి తెలిసిన వర్గాలు తెలిపాయి. వివాదాస్పద అణు కార్యక్రమంపై ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల మాదిరిగా కాకుండా, రష్యాతో చమురు, ఇంధన వాణిజ్యంపై నిషేధం లేదు. దీని అర్థం రష్యా నుండి ఏదైనా కొనుగోలును చేయడానికి అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం అవుతుంది.

చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటున్న భారతదేశం, తక్కువ ధరలకు ఎక్కడి నుండైనా కొనుగోళ్ల ద్వారా స్పైలింగ్ ఎనర్జీ బిల్లును తగ్గించుకోవాలని చూస్తోంది.

 
ఇలా ఉండగా,  సాంప్రదాయేతర సరఫరాదారు నుండి ఇంధనాన్ని తరలించడానికి అవసరమైన బీమా,  సరుకు రవాణా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, తగ్గింపు ధరలకు ముడి చమురును విక్రయించాలనే రష్యా ప్రతిపాదనను దేశం అంచనా వేస్తుందని ఇంధనపు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోమవారం రాజ్యసభకు తెలిపారు.

“గత రెండేళ్ళలో మహమ్మారి, గత కొన్ని వారాల్లో రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం లేదా సైనిక చర్య వంటి పరిస్థితిలో, ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని ఎంపికలను అన్వేషిస్తుందని నేను మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను ,” అని ఆయన స్పష్టం చేశారు.  రష్యా ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినట్లు కూడా  మంత్రి తెలిపారు.

“ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. రష్యాలో లేదా కొత్త మార్కెట్‌లలో లేదా మార్కెట్లోకి వస్తున్న కొత్త సరఫరాదారులతో ఎంత చమురు అందుబాటులో ఉంది వంటి అనేక సమస్యలు ఉన్నాయి. అలాగే, బీమా, సరుకు రవాణా, చెల్లింపు ఏర్పాట్లతో సహా అనేక ఇతర సమస్యలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి,” అని ఆయన వివరించారు. 

భారత చమురు కంపెనీలు తమ ఆసక్తులు, భద్రతపై దృష్టి సారిస్తున్నాయని ఓ పిఎస్‌యు ఎగ్జిక్యూటివ్‌ పేర్కొన్నారు. రష్యా నుంచి అనేక ఐరోపా దేశాలు చమురు కొనుగోలు చేస్తున్నప్పుడు భారత్‌ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. చమురు సంప్రదాయ ప్రాంతాలైన మధ్య ఈశాన్య దేశాలు ధరలు పెంచినప్పుడు రష్యాలో చౌకగా లభించే చమురు అవకాశాలను భారత కంపెనీలు ఉపయోగించుకోవడం మంచి అవకాశమేనని స్పష్టం చేశారు.

అమెరికా ప్రభుత్వ వర్గాలు సహితం భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం తాము విధించిన ఆర్ధిక ఆంక్షల పరిధిలోకి రాదని స్పష్టం చేయడం గమనార్హం. అయితే యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ విధంగా చేయడం ద్వారా చరిత్రలో ఒక దురాక్రమణదారుడి వైపు భారత్ ఉన్నట్లు అపఖ్యాతి పాలవుతుందని అంటూ భారత్ పై రష్యాకు వ్యతిరేకంగా వత్తిడి తెచ్చే  ప్రయత్నం మాత్రం చేస్తున్నట్లు కనబడింది.

కాగా, రష్యాపై ఆంక్షల నేపథ్యంలో తమ ప్లాంట్ల కోసం రష్యా ముడిచమురు కొనుగోలును తిరస్కరించే అవకాశం ఉందని రిలయన్స్  కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ బిజినెస్‌ హెడ్‌ క్రాకర్‌ రాజేష్‌ రావత్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం రిలయన్స్‌ తన రిఫైనరీ కాంప్లెక్స్‌ కోసం రష్యా యురల్స్‌ ముడిచమురును నేరుగా కొనుగోలు చేస్తోంది. రిఫైనరీలో అధిక భాగం మధ్య తూర్పు, అమెరికా నుంచి తీసుకుంటుంది.