చైనా కంపెనీలకు పేటియం డేటా..  ఆర్‌బిఐ చర్యలు 

పేటియం పేమెంట్‌ బ్యాంక్‌ తమ వినియోగదారుల సమాచారాన్ని విదేశీ సంస్థలతో పంచుకుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కొత్త ఖాతాలను తెరవడాన్ని నిలిపివేయాల్సిందిగా ఇటీవల ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. 

పేటియం పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన వివరాలను చైనా కంపెనీలకు లీక్‌ చేశారని బ్లూమ్‌బర్గ్‌ నివేదికలో పేర్కొంది. బ్యాంక్‌లో కొన్ని పర్యవేక్షణ లోపాలను గుర్తించడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పేటియం పేమెంట్స్‌ బ్యాంకు విదేశాల్లోని సర్వర్‌లకు డేటాను అనుమతించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు చెబుతున్నారు. 

దీనిని ఆర్‌బిఐ తన వార్షిక తనిఖీల్లో గుర్తించడంతో.. ఆ సంస్థ కొత్త ఖాతాలను చేర్చుకోవడంపై నిషేధం విధించినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఐటి వ్యవస్థపై నిర్వహించేందుకు ఓ ఐటి ఆడిట్‌ సంస్థను నియమించు కోవాలని ఆర్‌బిఐ సూచించింది. ఈ ఆరోపణలు నిరాధారమని పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌ పేర్కొంది.

కాగా, ఇప్పటికీ తీవ్ర నష్టాల్లో సాగుతున్న పేటియం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్‌ షేర్లు ఆర్‌బిఐ తాజా ఆంక్షలతో కుప్పకూలాయి. సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌లో ఈ షేర్‌ 12.21 శాతం క్షీణించి రూ.680.40కి పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.45,461.55 కోట్లకు పరిమితమ య్యింది. 

ఈ సంస్థ ఐపిఒ లిస్టింగ్‌ ధర రూ.2,150గా ఉంది. దీంతో పోల్చితే ఇప్పటి వరకు దాదాపు 70 శాతం విలువ తుడుచుకు పెట్టుకు పోయింది. దీంతో ఐపిఒలో స్టాక్స్‌ను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు భారీ నష్టాలు చవి చూడటంతో బోరుమంటున్నారు.