అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి…ఎస్బీఐ సూచన

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఐరోపా సహా వివిధ దేశాలు రష్యాపైన ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆంక్షలు విధించి,  ఐరోపా దేశాలు స్విఫ్ట్ సిస్టం నుంచి కూడా తొలగించిన విపరిస్థితులను అవకాశంగా తీసుకొని అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిను ప్రవేశపెట్టాలని ఎస్బీఐ తన తాజా నివేదికలో సూచించింది. 
 
అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికన్‌ డాలర్‌ తన అధిపత్యాన్ని ఎప్పటినుంచో చెలాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాపారాలు పూర్తిగా డాలర్‌తోనే నడుస్తున్నాయి. అమెరికన్‌ డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర కరెన్సీను తెచ్చేందుకు పలు దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యీరో ను తీవాలని ఐరోపా యూనియన్, రూబుల్ తీసుకు రావాలని రష్యా ప్రయత్నాలు చేశాయి. 
 
ఇప్పుడు ఉక్రెయిన్‌తో పోరు నేపథ్యంలో అమెరికా, ఐరోపా ఆంక్షల కారణంగా రష్యా వివిధ దేశాలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడింది. ఈ నిర్ణయమే భారత్‌కు కలిసి రాగలదని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. అమెరికాతో పాటుగా ఐరోపా  దేశాలు రష్యాపై భారీ ఆంక్షలను విధించడంతో తెరపైకి కొత్త అంతర్జాతీయ కరెన్సీ వాడకంపై ప్రతిపాదనలు వస్తున్నాయి.
పశ్చిమ దేశాల ఆంక్షలను అధిగమించేందుకు రూపాయి-రూబుల్ లేదా రూబుల్ యువాన్ వాణిజ్యాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది భారత కరెన్సీ అంతర్జాతీయీకరణకు అవకాశంగా మారుతుందని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. అంతేకాకుండా డాలర్‌కు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచం అన్వేషిస్తోందని, రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారడానికి ఇది సరైన సమయమని ఈ నివేదిక తెలిపింది.

ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే అమెరికా కరెన్సీ డాలర్ ఆధిపత్యం మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగవచ్చు. అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలుదేశాలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. ప్రస్తుతం రష్యాపై ఆంక్షల నేపథ్యంలో మాస్కో యువాన్ – రూబుల్ లేదా రూపాయి-రూబుల్ కోసం తెరవెనుక చర్చలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. 

సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంతో చెల్లింపులు చేసే అంశాన్ని కూడా కొంతమంది ప్రతిపాదిస్తున్నట్లు ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. స్విఫ్ట్ పేమెంట్ సిస్టం నుంచి రష్యాను తొలగించడంతో ఆ దేశం భారీగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో రష్యా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.

రష్యాపై విధిస్తోన్న ఆంక్షల నేపథ్యంలో రూపాయి అంతర్జాతీయీకరణ ఆలోచనకు అడుగులు పడేలా చేసిందని ఈ నివేదిక అభిప్రాయపడింది. ప్రత్యామ్నాయ చెల్లింపు, పరిష్కార విధానాలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కూడా వెల్లడి చేస్తోందని తెలిపింది. భారత్‌ రూపాయిను అంతర్జాతీయం మారకంగా వాడే బంగారు అవకాశం  ఇదే అంటూ నివేదికలో ఎస్బీఐ పేర్కొంది.

అయితే రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా వినియోగిస్తే ఇబ్బందులు కూడా లేకపోలేదు. ద్రవ్య పరపతి విధానం సంక్లిష్టమవుతుంది. అయితే అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ వ్యయం మాత్రం తగ్గుతుందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రూపాయి మారకం మరింత నష్టపోకుండా ఆర్బీఐ చర్యలు చేపడుతోంది.

ప్రపంచదేశాలకు రష్యా క్రూడాయిల్‌ను భారీగానే సరఫరా చేస్తోంది. ఆంక్షల నేపథ్యంలో ఇది కాస్త ఇబ్బందిగా మారింది. కాగా భారత్‌కు ముడిచమురును డిస్కౌంట్ పైన అధికంగా ఇస్తామని రష్యా ప్రతిపాదించింది. ఇప్పటికే రష్యన్‌ చమురు సంస్థలు ఎంతో తక్కువ ధరకు చమురు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. రష్యా జరిపే వాణిజ్యలో రూపాయి-రూబుల్‌ ప్రవేశపెడితే ఇరుదేశాలకు లాభం చేకూరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.