పాక్‌లో పడ్డ క్షిపణిపై విచారణకు భారత్ ఆదేశం

భారత్‌కు చెందిన మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనపై మోదీ ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బుధవారం సాయంత్రం సిస్రా వైపు నుంచి సూపర్‌సోనిక్‌ మిస్సైల్‌ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్‌ సరిహద్దులో కూలింది. 
 
ఈ ఘటనపై భారత ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ఈ విషయమై శుక్రవారం రక్షణ శఆఖ మంత్రి మాట్లాడుతూ సాంకేతిక లోపం కారణంగా పొరపాటుగా జరిగిన ఘటన ఇదని పేర్కొన్నారు. ఈ క్షిపణి 40,000 అడుగుల ఎత్తులో దూసుకెళ్లిందని, పాక్‌ భూభాగంలోని పౌర నివాసాలు, పాక్‌తోపాటు భారత్‌ గగనతలంలోని ప్రయాణ విమానాలకు ముప్పును రేకెత్తించిందని పాకిస్థాన్‌ ఆరోపించింది. ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది.
 
బుధవారం సాయంత్రం భారత్‌లోని సిర్సా (హరియాణా) వైపు నుంచి ఒక సూపర్‌సోనిక్ క్షిపణి, పంజాబ్ ప్రాంతంలోని మియాన్ చన్ను అనే ప్రాంతంలో పడినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ఇది తమ దేశపు ఎయిర్‌స్పేస్ నిబంధనల ఉల్లంఘనే అని పాక్ విమర్శించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కొన్ని నివాసాలు మాత్రం ధ్వంసమయ్యాయని చెప్పింది. 
 
ఈ క్షిపణి ప్రయాణించిన మార్గం విమానాలు ప్రయాణించే మార్గమని, రెండు దేశాలకు సంబంధించిన విమానాలకు ప్రమాదం జరిగి ఉండేదని పాకిస్తాన్ రక్షణశాఖ విశ్లేషించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ఏవియేషన్ సేఫ్టీ ప్రొటోకాల్‌కు విరుద్ధమని పాక్ ప్రకటించింది.
కాగా, పాక్ విదేశాంగ శాఖ భారత దౌత్య ప్రతినిధులను పిలియించి ఈ సంఘటన పట్ల నిరసన వ్యక్తం చేసింది. నిస్పక్ష మైన, పారదర్శకమైన విచారణ జరిపించాలని కోరింది.