జమ్ముకశ్మీర్‌లో నలుగురు ముష్కరుల హతం

శుక్రవారం రాత్రి నుంచి జమ్ములోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లలో నలుగురు ముష్కరులను మట్టుపెట్టినట్లు అధికారులు ధృవీకరించారు. జమ్ముకశ్మీర్‌లో శనివారం ఉదయం హైఅలర్ట్‌ ను భద్రతా అధికారులు ప్రకటించారు.

శుక్రవారం రాత్రి సమయంలో.. పుల్వామా చవల్కాన్‌లో, హంద్వారా నెచమా, గందర్‌బాల్‌ ఏరియాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈక్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరపగా, భద్రతా దళాలు ప్రతిదాడికి దిగాయి. జమ్మూకశ్మీర్‌లోని గండర్‌బాల్, పుల్వామా,  హంద్వారా జిల్లాల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు శనివారం తెలిపారు.

‘‘మేం నిన్న రాత్రి నాలుగైదు ప్రదేశాలలో ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించాం. ఇప్పటివరకు పుల్వామాలో ఒక పాకిస్థానీతో సహా జైషే మహ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు, గండర్‌బాల్, హంద్వారాలో ఒక్కొక్క ఉగ్రవాదిని హతమార్చాం. హంద్వారా, పుల్వామాలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. అలాగే ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాం’’ అని జమ్మూ కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్‌ ట్వీట్ చేశారు.

.ఈ ఎదురుకాల్పుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు.దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని చెవా కలాన్ ప్రాంతంలో రాత్రిపూట జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

హంద్వారాలోని నెచామా, రాజ్‌వార్ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో ఒక ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదుల గాలింపు   ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.