రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో మాట్లాడనున్న మోదీ!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్స్కీలతో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ప్రకటన వచ్చింది. రష్యా- ఉక్రెయిన్ మధ్య 12వరోజు కూడా యుద్ధం భీకరంగా సాగుతోంది.  
 
ఈ నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు తీవ్ర విమర్శలకు దిగాయి. యుద్ధం విరమించుకోవాలని కొన్ని దేశాలు రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే మొదటి నుంచి కూడా భారత్ తటస్థ వైఖరితో ఉంది. యుద్ధాన్ని ఆపించేలా చర్యలు తీసుకోవాలని జెలెన్స్కీ ప్రధాని మోదీని తరచూ కోరుతున్నారు.
 ఆ దేశ విదేశాంగ మంత్రి కుబెలా కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడి యుద్ధం విరమింపజేయాలని ప్రధానిని కోరారు. మరోవైపు భారత్ లో ఉన్న ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోరో పొలికా  ప్రధాని మోదీని ఈ విషయమై అభ్యర్థించారు. అమెరికా వంటి దేశాలు కూడా రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ స్పందించాలని ఒత్తిడి తీసుకోస్తున్నాయి. 
 
కాగా, రష్యాపై దౌత్య ఒత్తిడిని పెంచే దిశగా కలిసిరావాలని భారత్‌, చైనాకు బ్రిటన్‌ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని గత శనివారం మాస్కోకు వెళ్లి పుతిన్ తో మాట్లాడారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ దేశం వేళ్ళని ఏకైక దేశాధినేత ఆయనే కావడం గమనార్హం. ఆయన యుక్రెయిన్ అధ్యక్షునితో కూడా  టెలిఫోన్ లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య రాజీకోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. 
 
ఇంకొకవైపు,  రష్యా, ఉక్రెయిన్‌ మధ్య న్యాయమైన చర్చలతోబాటు అమెరికా, నాటో, ఇయు, రష్యా మధ్య సమస్థాయి చర్చలను చైనా ప్రోత్సహిస్తుందని చైనీస్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దేశాల మధ్య ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యల పరిష్కారానికి ఇవి అవసరమని స్పష్టం చేశారు. 
 
 రష్యా, ఉక్రెయిన్‌ మధ్య చర్చలకు దౌత్యం నెరపగలిగే స్థితిలో పశ్చిమ దేశాలు లేవని, ఈ పరిస్థితుల్లో చైనాయే ఆ పాత్ర పోషించాలని ఇయు అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలపై ఇయులోని చైనా దౌత్య ప్రతినిధి బృందం పై విధంగా స్పందించింది.
 

మరో వైపు ఉక్రెయిన్ పై రష్యా బాంబు దాడులతో విరుకుపడుతున్న క్రమంలో అక్కడ ఉన్న భారతీయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడి వారిని క్షేమంగా భారత్ కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా ప్రధాని ఈ విషయమై మాట్లాడారు. 

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయల తరలింపుకు సహకారం అందించాలని ఈ సందర్భంగా పుతిన్ ను మోదీ  అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. 

ఇప్పటికే దాదాపు 16 వేల మందికి పైగా భారత్ కు తీసుకొచ్చినట్లు విదేశాంగ తెలిపింది. అయితే ఇంకా చాలా మంది భారతీయులు ఉక్రెయిన్ లోనే ఉండిపోయారని, వారిని కూడా భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారత్ తెలిపింది.

ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని ఫోన్ లో మాట్లాడబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా.. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో చివరిసారిగా గత నెల 26న మోదీ  జెలెన్స్కీతో మాట్లాడారు.