ఓటమి నుండి కేసీఆర్ ను పాక్ ఉగ్రవాదులు కాపాడలేరు

వచ్చే ఎన్నికలలో ఓటమి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ను పాకిస్థాన్ ఉగ్రవాదులు కూడా కాపాడలేరని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు, కేసులకు, దాడులకు బీజేపీ భయపడబోదని స్పష్టం చేశారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టడం ఎవరికి సాధ్యమయ్యే పని కాదని హెచ్చరించారు.
బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెబుతూ  తన పాలనలో అన్ని వర్గాలను మోసం చేయటమే కేసీఆర్ తీసుకొచ్చిన గుణాత్మమైన మార్పు అని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ లోక్​సభ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా చంపాపేటలో నిర్వహించిన హైదరాబాద్ లోక్​సభ నియోజకవర్గ రివ్యూ సమావేశానికి కిషన్​రెడ్డి హాజరై మాట్లాడారు.
సెక్రటేరియట్​కు  రాకుండా పాలన చేయటం, దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయటం, ఉద్యోగాలు ఇవ్వకపోవటం ఇవన్నీ  కేసీఆర్ తెచ్చిన  గుణాత్మకమైన మార్పులని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశారన్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ మాదిరిగా బీజేపీ కుటుంబ పార్టీ కాదని చెప్పారు. ‘‘దేశంలో కూడా కల్వకుంట్ల కుటుంబ పెత్తనం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నరు. బంగారు తెలంగాణ కాలేదు గానీ రాష్ట్రం వచ్చాక కేసీఆర్  కుటుంబం బంగారు కుటుంబం అయింది” అని దయ్యబట్టారు.  వడ్లను కొనేది కేంద్రం మాత్రమేననే విషయం రైతులకు అర్థమైందని ఆయన చెప్పారు. పొదుపు సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. బీజేపీపై కక్షకట్టిన కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

ఎన్నికల హామీలు అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అంటూ  రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం తిరస్కరించిందని చెప్పారు. 

వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ మాత్రమేనని, కేసీఆర్ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలు రిజర్వేషన్లు కోల్పోయారని ధ్వజమెత్తారు. వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టం చేశారు.  

రైతులు, ప్రజల సమస్యలపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలం పోరాటం చేస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్  చెప్పారు. కేసీఆర్​కు కేటీఆర్​తో పాటు మరో ఇద్దరు కొడుకులు ఉన్నారని, వారు అసదుద్దీన్ , అక్బరుద్దీన్​లు అని ఎద్దేవా చేశారు.  దేశంతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ ఖతం అయిందని స్పష్టం చేశారు. 

హైదరాబాద్ లోక్​సభ నియోజకవర్గ సీటును బీజేపీ గెలుస్తుందని, ఒవైసీని ఇంట్లో కూర్చోపెడ్తామని చెప్పారు. ‘‘కేసీఆర్ తనకు తాను సింహం అనుకుంటడు. బీజేపీకి ఆయన ఎలుకతో సమానం. తెలంగాణ కేసీఆర్​ జాగీరు కాదు’’ అని పేర్కొన్నారు. 

‘‘ఫామ్ హౌస్​లో ఉన్న కేసీఆర్​ను బీజేపీ గల్లా పట్టి  గుంజితేనే బయటకు వచ్చిండు.  జైలుకు పోతానన్న భయంతోనే  దేశంలో పర్యటిస్తుండు. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్​కు ఇంటి పోరు ఎక్కువైంది” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు​ బండి సంజయ్ చెప్పారు.

 బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు చేసి తీరుతామని సంజయ్ ప్రకటించారు. టీఆర్​ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని, లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్లు నిర్మించుకోవడానికి బడ్జెట్​లో నిధులు కేటాయించుకోవాలని హితవు చెప్పారు. 

పాతబస్తీలో గణేశ్​ నిమజ్జనం కార్యక్రమానికి కేసీఆర్, అసదుద్దీన్ ఎందుకు హాజరుకావటం లేదని ప్రశ్నించారు. యూపీలో నిర్మిస్తున్న రామ మందిరం మాదిరిగానే పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని నిర్మిస్తామని చెప్పారు.