హిజాబ్ పై భారత్ లో నిషేధం లేదు.. కేంద్ర మంత్రి స్పష్టం

హిజాబ్ పై భారత దేశంలో నిషేధం లేదని  కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. అయితే పాఠశాలలు, విద్యాసంస్థలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుందని, వారు పెట్టిన నిబంధనల ప్రకారం విద్యార్థులు నడుచుకోవాల్సి ఉంటుందని సూచించారు. ప్రస్తుతం హిజాబ్ అంశం కోర్టులో ఉందని ఆయన పేర్కొన్నారు. 

కేంద్ర మైనారిటీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్  ఎన్టీఆర్ స్టేడియంలో 37 వ హునార్ హాత్ స్వదేశీ చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు.  హునార్ హాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నక్వీ, కిషన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నక్వీ మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం తొలిసారిగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేతివృత్తులవారు. కళాకారుల స్వదేశీ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు మిషన్ మోడ్ పై కృషి చేయడం ప్రారంభించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా హస్త కళాకారుల ఆదాయం మెరుగుపడుతుందని చెప్పారు.

హునార్ హాట్ కార్యక్రమం వల్ల వారసత్వ కళలు పునరుజ్జీవింప చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆరేళ్లుగా హునర్ హాట్ ద్వారా కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. సుమారు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇందులో పాల్గొంటారని నఖ్వీ తెలిపారు.

ఆసియా ఖండానికి చెందిన హస్త కళల ప్రదర్శన జరుగుతోందని ఆయన చెప్పారు. హునర్ హాట్ లో ప్రతిరోజు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. దేశంలోని స్వదేశీ వంటకాలు ఇక్కడ లభిస్తాయని పేర్కొన్నారు. హునర్ హట్ లో పాల్గొన్న కళాకారులు, శిల్పకారులు, చేతి వృత్తిదారులకు ధన్యవాదాలు తెలిపారు. వారి జీవితాలు బాగుపడేందుకు హునర్ హట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

కళాకారులు, చేతివృత్తుల వారికి సాధికారత కల్పించే సమర్థవంతమైన ప్రయత్నం అయిన హునార్ హాట్ గత 7 సంవత్సరాలలో  లక్షల మంది కళాకారులతో పాటు చేతివృత్తుల వారికి ఉపాధి అవకాశాలను అందించిందని తెలిపారు. ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  స్వయం సమృద్ధ భారతదేశం, వోకల్ ఫర్ లోకల్ ప్రచారానికి విశ్వసనీయమైన బ్రాండ్ గా హునార్ హాట్ మారిందని చెప్పారు.