2030 నాటికి కొత్త వాహనాల్లో 30 శాతం విద్యుత్

దేశవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు పునరుత్పాదక ఇంధన వనరులే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో విశేషంగా ప్రయత్నాలు చేస్తున్నది.  ఈక్రమంలో సౌర, పవన విద్యుత్‌ను ఎక్కువ మోతాదులో తయారుచేయడం, దానిని నిల్వచేసుకోవడానికి అనువైన ఉపకరణాలను రూపొందించుకుంటే భవిష్యత్‌లో ఇంధన డిమాండ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నది. 

ఈక్రమంలోనే బ్యాటరీ మీద నడిచే విద్యుత్వా హనాలను మరింతగా ప్రోత్సహించాలని చూస్తున్నది.దానితో  భారత దేశంలో బ్యాటరీల అవసరం భారీగా పెరగనుంది. రానున్న రోజుల్లో విద్యుత్ వాహనాల ఉత్పత్తి పెద్దఎత్తున చేపట్టనున్నారు. కాలుష్య నియంత్రణ, కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం బ్యాటరీలను ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ తాజా నివేదికలో పేర్కొంది. 2030 నాటికి దేశంలో కొత్త వాహనాల అమ్మకాల్లో 30 శాతం విద్యుత్ వాహనాలే ఉంటాయని తెలిపింది.

అయితే బ్యాటరీల డిమాండ్‌ ఎంత మేరకు ఉందో అందులో 20 శాతం కూడా మనకు అందుబాటులో లేవని తేల్చింది. విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో దాన్ని స్టోరేజ్‌ (నిల్వ) చేయడం అంతకంటే ప్రధానమని స్పష్టం చేసింది. రెన్యువబుల్‌ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి)ని పెంపొందించుకునేందుకు భారీ ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. 

రానున్న రోజుల్లో బ్యాటరీలతో ఎక్కువ అవసరం ఉంటు-న్న దృష్ట్యా వాటిని భారీఎత్తున ఉత్పత్తి చేసుకోవాలని సూచించింది. 2030 కల్లా అంతర్జాతీయ రెన్యువబుల్‌ ఎనర్జీ మార్కెట్‌ ఏడాదికి 150 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఎనర్జీ ఉత్పత్తితో పాటు- స్టోరేజ్‌ కేంద్రాల ఏర్పాటు-కు ఆంధ్రప్రదేశ్‌లో 3 ప్రాంతాలను ఎంపిక చేసింది.

ఇందులో ఒకటి అనంతపురం జిల్లా రామగిరి మండలంలో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు  చేస్తున్నామని, ఇది టెండర్ దశలో ఉందని నీటి ఆయోగ్‌ పేర్కొంది. ఏపీఈపీడీసీఎల్‌, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు  చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. 2030 నాటికి దేశంలోనే మొబైల్‌ బ్యాటరీల మార్కెట్‌ విలువ 15 బిలియన్‌ డాలర్లు అంటే రూ.లక్ష కోట్లు  దాటుతుందని వెల్లడించింది. 2070 నాటికి దేశంలో మొత్తం విద్యుత్ వాహనాలే ఉంటాయని నీతిఆయోగ్‌ తన నివేదికలో పేర్కొంది.