అసమ్మతివాదులను సంజయ్ హెచ్చరిక 

పార్టీలో కట్టుతప్పితే ఎంతటివారైనా సరే వారిపై వేటు తప్పదని అసమ్మతివాదులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా పదాధికారాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పారు. అసంతృప్తి నేతల సమావేశంపై ఆయన సీరియస్ అయ్యారు. 
 
ఎంతటి సీనియర్ నాయకులైనా పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాల్సిందేనని సంజయ్ స్పష్టం చేశారు. ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసమ్మతి వాదులుంటారని మండిపడ్డారు.  వారు పనిచేయరని, పనిచేసే వాళ్లపై అక్కసు గక్కడమే వారి పని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన  అవసరం లేదని పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు. పార్టీ కోసం చిత్తశుద్దితో కృషి చేయాలని సూచించారు.రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే సమయమిదని తెలిపారు.  అలాంటి వాళ్ల మాటలు నమ్మి దారి తప్పితే రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. 
 
ఇలా ఉండగా, రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయిందని, టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ విషయం కేసీఆర్ కు అర్ధమైందని సంజయ్ స్పష్టం చేశారు. ఏం చేయాలో తెల్వక పీకే (ప్రశాంత్ కిషోర్) అనే వ్యూహకర్తను పెట్టుకుని ‘ఫెడరల్ ఫ్రంట్’ అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టిండని ధ్వజమెత్తారు. బీజేపీపైనా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా విష ప్రచారం చేస్తుండని మండిపడ్డారు. 
 
 ఎంత చేసినా టీఆర్ఎస్ గ్రాఫ్ పెరగట్లేదని, ప్రజలు బీజేపీవైపు మొగ్గుచూపుతున్నరని సర్వేలు చెబుతుండటంతో తట్టుకోలేక బీజేపీ నేతలపై దాడులకు పురిగొల్పుతున్నడని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టలంటూ, జైళ్లంటూ భయపెడుతున్నడని అంటూ రాబోయే రోజుల్లో ఈ నిర్బంధాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆయన పార్టీ నేతలను హెచ్చరించారు. 
అయినా బీజేపీ నేతలెవరూ భయపడాల్సిన పనిలేదని,  జాతీయ నాయకత్వం మనకు పూర్తి అండగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై ఉద్రుతంగా పోరాడండి. టీఆర్ఎస్ నేతల ఆరోపణలను, విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టండి అని  పిలుపునిచ్చారు.
 
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలుసహా స్థానిక ప్రజా ప్రతినిధులెవరికీ పనులు చేయొద్దంటూ కేసీఆర్ అనధికార ఆదేశాలిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దుష్ట సాంప్రదాయం లేదని చెప్పారు.ఇతర రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలకూ తగిన గౌరవం ఉంటోందని తెలిపారు. 
 
చివరకు రాష్ట్ర ప్రథమ పౌరురాలు, గవర్నర్ తమిళ సై విషయంలోనూ కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ మేడారం వెళ్తే హెలికాప్టర్ సమకూర్చకుండా… మంత్రులు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలకకుండా చేస్తున్నారంటే… కేసీఆర్ ఎంతటి చిల్లర వ్యక్తో అర్ధం చేసుకోవాలని సూచించారు. 
 
కాగా, కరీంనగర్‌ బీజేపీ నేతలు కొందరు హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే గజ్జుల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన రహస్య భేటీ జరుపుతున్నట్లు తెలియడంతో సంజయ్ ఆగ్రహం చెందారని తెలుస్తున్నది.  ఇప్పటికే నేతలు రెండుసార్లు సమావేశమైయ్యారు. ఈ రహస్య భేటీలపై గతంలోనే బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. అయినా నేతలు మరోసారి సమావేశం నిర్వహించారు.