ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్న భారత నౌకాదళం పనితీరు అద్భుతమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు. విశాఖపట్నం వేదికగా సోమవారం జరిగిన 12వ ‘ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ’ కార్యక్రమంలో నౌకాదళాన్ని ఆయన సమీక్షించారు.
‘మన నౌకాదళం స్వావలంబనలో అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. ఇది నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది’ అంటూ కొనియాడారు. ‘మేకిన్ ఇండియా’ దిశగా దేశీయ పరిజ్ఞానంతో దేశీయ షిప్యార్డుల్లో నౌకలను తయారు చేసుకుంటూ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని తెలిపారు.
70 శాతానికిపైగా యుద్ధనౌకలు, సబ్మెరైన్లు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ షిప్యార్డుల్లో తయారవుతున్నాయన్నారు. త్వరలో న్యూక్లియర్ సబ్మెరైన్లు కొన్ని, ఎయిర్క్రాఫ్ట్ కేరియర్ (యుద్ధవిమానాలను చేరవేసే) ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా దేశీయ రక్షణ రంగంలోకి రానున్నట్లు తెలిపారు.
44 యుద్ధనౌకలు నడి సముద్రంలో, నాలుగు వరుసల్లో లంగరు వేసి ఉండగా, ప్రత్యేకంగా అలంకరించిన ‘ఐఎన్ఎస్ సుమిత్ర’లో వాటి మధ్యగా వెళుతూ పరిశీలించారు. ఆయా నౌకల్లో పది వేల మంది సిబ్బంది ధవళ వస్త్రాలను ధరించి, గౌరవ సూచికంగా తలపై టోపీని తీసి, తల వంచుతూ రాష్ట్రపతికి అభివాదం చేశారు.
ఈ సందర్భంగా వారు సర్వసైన్యాధ్యక్షుడికి ‘జై.. జై.. జై..’ అంటూ మూడుసార్లు జేజేలు పలికారు. వీవీఐపీలతో కూడిన సుమేధ, సావిత్రి నౌకలు ఆయన నౌకను అనుసరించాయి. మొత్తం 60 యుద్ధనౌకలు, 55 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, మూడు సబ్మెరైన్లు ఈ సమీక్షలో పాల్గొన్నాయి.
క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’, సబ్మెరైన్ ‘ఐఎన్ఎస్ వేలా’ కూడా సమీక్షకు హాజరయ్యాయి.
సెయిలింగ్ బోట్లు ఐఎన్ఎస్ తరంగిణి, ఐఎన్ఎస్ మాధేయి రంగురంగుల తెరచాపలతో అలలపై మెల్లగా కదులుతూ కనువిందు చేశాయి.
మెరైన్ కమెండోలు సముద్రంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించి, రక్షించే విన్యాసాలు ఉత్కంఠకు గురిచేశాయి. డార్నియర్, హాక్, పీ8ఐ విమానాలు, చేతక్, కమోవ్, సీకింగ్ హెలికాప్టర్లు ఒక దాని పక్కనే ఒకటి.. గుంపులుగా వచ్చి అబ్బురపరిచాయి.
స్వదేశీ శక్తితో నిర్మించబడిన విమానాలు, పలు డార్నియర్లు, ఐఎన్ మిగ్ 29 యుద్ధ విమానాలు, ఇండియన్ నేవీ, కోస్ట్గార్డ్ షిప్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. దేశ ప్రజలకేగాక ప్రపంచ దేశాలకూ మన సొంత శక్తి ఏమిటో తెలియజెప్పడం ఈ ఫ్లీట్ రివ్యూ ప్రధాన ఉద్దేశం.
సబ్మెరైన్లు ఐఎన్ఎస్ సింధురాజ్, సింధుకీర్తి, వేలా రాష్ట్రపతి నౌక పక్కగా వచ్చి ఉనికిని ప్రదర్శించి, అంతలోనే కనుమరుగైపోయాయి. మెరైన్ కమెండోలు హెలికాప్టర్ల నుంచి పారాచ్యూట్ల ద్వారా కిందికి దూకి చేసిన విన్యాసాలు అలరించాయి. రాష్ట్రపతిని తొలుత దేశ త్రివిధ దళాధిపతులు సుమిత్ర నౌకలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఆయన వెంట రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి దేవుసిన్హ్ జే చౌహాన్, భారత నౌకాదళ అధిపతి ఆర్.హరికుమార్, తూర్పునౌకాదళం అధిపతి బిశ్వజిత్ దాస్ గుప్తా ఉన్నారు. 12వ పిఎఫ్ఆర్కు గుర్తుగా స్టాంప్ను రాష్ట్రపతి విడుదల చేశారు.
విశాఖపట్నానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్న భారత నావికాదళం ఏకంగా ఆ పేరుతో ఒక యుద్ధనౌకను నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.9 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ను సోమవారం జరిగిన రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూలో మొట్టమొదటి ఫ్లాగ్షి్పగా ప్రదర్శించింది.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
7, 8 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీలో పర్యటన
జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రత్యేక కోర్టు కోరిన సీబీఐ