కాలేజీ విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు

మణిపూర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోలో  తాము మరోసారి అధికారంలోకి వస్తే ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థినులకు ద్విచక్రవాహనాలు అందచేస్తామని ప్రకటించింది. 
 
అదే విధంగా , సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం నెలకు రూ. 200 చొప్పున ఇస్తున్న పింఛన్లను రూ. 1,000కి పెంచుతామని, రూ. 100 కోట్లతో స్టార్టప్ నిధి ఏర్పాటు చేస్తామని బిజెపి తన మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. 
 
బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మేనిఫెస్టోను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ నాయకత్వంలో రాష్ట్రం గత ఐదేళ్లుగా ప్రగతి పథంలో దూసుకెళ్తోందని, డ్రగ్స్ బెడదను సమర్థవంతంగా కట్టడి చేయడంతోపాటు శాంతి భద్రతలను నియంత్రించిందని కొనియాడారు. 
 
రాష్ట్రంలో మహిళా సాధికారతను సాధించేందుకు ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు అందచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాణి గైడిన్‌లియు నూపి మహీరోయ్ సింగి పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలకు రూ. 25,000 అందచేస్తామని కూడా ఆయన వాగ్దానం చేశారు.

మేనిఫెస్టోలోని అంశాలు.. 

– వృద్ధాప్య పింఛన్‌ రూ. 200 నుంచి రూ. 1000కి పెంపు.
– ఉన్నత విద్య కోసం విద్యార్థినులకు రూ. 25 వేల ఆర్థిక సాయం.
– 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లు.
– ప్రతిభ కనబరినచిన విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు.
– ఉచితంగా ఏడాదికి రెండు ఎల్​పీజీ సిలిండర్లు.
– మత్స్యకారులకు రూ.5 లక్షల వరకు ఉచిత బీమా.
– పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి నుంచి ఏడాదికి అందించే ఆర్థిక సాయం రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు పెంపు.
-మహిళలు, యువత, రైతులకు సాధికారత కల్పించడం.
– పీజీ, సాంకేతిక విద్య అభ్యసిస్తున్న రైతుల పిల్లలకు స్కాలర్​షిప్​లు.
– సాంస్కృతిక వారసత్వం, స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ.
– ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్​) ఏర్పాటు.