ఉత్తర ప్రదేశ్ ప్రజలను అవమానిస్తున్న కాంగ్రెస్ 

ఉత్తర ప్రదేశ్, బిహార్, ఢిల్లీ   “భయ్యా”లను   పంజాబ్‌లో ప్రవేశించనివ్వొద్దని పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ పిలుపునివ్వడంపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను అవమానించారని ధ్వజమెత్తారు. 
 
ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలను ఉద్దేశించి “భయ్యాలు” అనే పదాన్ని ఉపయోగించడం సాధారణంగా అభ్యంతరకరంగా పరిగణిస్తారు.  ఆ సమయంలో చన్నీ పక్కనే  ఉన్న  ఆ పార్టీ నేత, ఉత్తర ప్రదేశ్ `కుమార్తె’  ప్రియాంక గాంధీ వాద్రా నవ్వుతున్నారని  ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
కాగా,  పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఉత్తర ప్రదేశ్ ప్రజలను పబ్లిక్ గూండాలని అన్నారని, అఖిలేశ్ యాదవ్ ఆమెకు పెద్ద పెద్ద పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌ను అవమానించే పనిని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ చేపట్టాయా? అని ప్రశ్నించారు.  ఉత్తర ప్రదేశ్ ప్రజలను గూండాలుగా పేర్కొనడాన్ని వీరంతా ఎలా సమర్థిస్తారని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు.
ఉత్తర ప్రదేశ్ ప్రజలు అనేక రాష్ట్రాలు, దేశాలకు వెళ్తూ, తమ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నారన్నారు. చన్నీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వంటివారు ఆ మంచి పేరును చెడగొడుతున్నారని ఆయన ఆరోపించారు.  ఉత్తర ప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్ దర్వాత సమాజ్‌వాదీ పార్టీ అయోమయంలో పడిందని అనురాగ్ ఎద్దేవా చేశారు. అఖిలేశ్ యాదవ్‌కు చెమటలు పడుతున్నాయని ధ్వజమెత్తారు.
మహిళా సభ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు గీత షాక్యపై దాడి జరిగిందని,  ఎస్‌పీ సింగ్ బాఘెల్‌పై కర్హాల్ నియోజకవర్గంలో  సమాజ్‌వాదీ పార్టీ గూండాలు దాడి చేశారని విమర్శించారు.  ఈ గూండాలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మయిన్ పురి జిల్లాలోని కర్హాల్, ఇటావా తదితర నియోజకవర్గాల్లో పారామిలిటరీ దళాలను మోహరించాలని కోరారు. అంతకుముందు అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ నేతల బృందం ఈ సంఘటనలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.  ఉత్తర ప్రదేశ్, బిహార్ సోదరులను పంజాబ్‌లో ప్రవేశించనివ్వొద్దని పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ పిలుపునిచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసేటపుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అక్కడే ఉన్నారు. ఆమె చిరునవ్వులు చిందించారు.
బీజేపీ నేత తేజస్వి సూర్య ట్విట్టర్‌లో చన్నీ వీడియోను పంచుతూదీనిపై ప్రియాంక గాంధీ వాద్రాను లక్ష్యంగా చేసుకొని మండిపడ్డారు. “ప్రియాంక వాద్రా జీ తనను తాను ఉత్తరప్రదేశ్ కుమార్తెగా పిలుచుకుంటోంది.  పంజాబ్‌లో ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలను  అవమానిస్తునప్పుడు ఆమె చప్పట్లు కొట్టారు. ఇది ఆమె ద్వంద్వ పాత్ర, ముఖం కూడా” అని సూర్య విమర్శించారు.

ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ  వ్యాఖ్యలను “చాలా సిగ్గుచేటు” అని పేర్కొన్నారు. చన్నీ వ్యాఖ్యలపై వ్యాఖ్యానించమని విలేకరుల సమావేశంలో అడిగినప్పుడు “ఏ వ్యక్తి లేదా ఏదైనా నిర్దిష్ట సమాజంపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” అని ఆయన బదులిచ్చారు.

చన్నీ తన చర్మపు ఛాయపై గతంలో తనను ‘కాలా (చీకటి)’ అని పిలిచేవాడని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ప్రియాంక గాంధీ కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారేనని భగవంత్ మాన్ చెప్పినప్పుడు, ఆమె కూడా “భయ్యా” అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.