పదేళ్లుగా ప్రభుత్వంకు అద్దె చెల్లించని కాంగ్రెస్, సోనియా

కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు ఏండ్లుగా అద్దె చెల్లించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి, పార్టీ అధ్యక్షురాలుతో సహా పలువురు నాయకులు ఉండే ఇండ్లను ప్రభుత్వం నుంచి అద్దెకు తీసుకుని వాడుకుంటూ అద్దె చెల్లించడం లేదని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. 

సమాచార హక్కు కార్యకర్త సుజిత్ పటేల్ దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తుకు సమాధానంగా ఈ వివరాలను తెలిపింది. పైగా, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీ కార్యాలయాలకు మూడేళ్ల గడువుతో అద్దెకు భవనాలను వాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.

ఆ లోపు ఆయా పార్టీలు వాటికి కేటాయించిన స్థలంలో సొంత కార్యాలయాలు నిర్మించుకుని, కేంద్రం ఇచ్చిన భావనాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా తీసుకున్న భవనాలను ఆ గడువు దాటిపోయినా కాంగ్రెస్ పార్టీ మళ్లీ మళ్లీ పొడిగించుకుంటూ వస్తోంది. పైగా ఆ భవనం అద్దె కూడా కట్టడం లేదు.

సుజిత్ పటేల్ ఆర్టీఐ పిటిషన్‌కు ఇచ్చిన సమాధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనానికి సంబంధించిన అద్దెను 2012 డిసెంబర్‌‌ నుంచి చెల్లించలేదు. అంటే తొమ్మిదేళ్లు పూర్తయి,  పదో ఏడాది నడుస్తోంది. ఇన్నేండ్లుగా మొత్తం రూ.12,69,902 చెల్లించాల్సి ఉందని కేంద్రం పేర్కొంది.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అద్దె మాత్రమే కాదు, ఆ పార్టీ నేతలు కూడా కేంద్రానికి అద్దె క్రింద భారీగా పెండింగ్ పడ్డారు. 10 జన్‌పథ్‌ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి సంబంధించి 2020 సెప్టెంబర్ నుంచి అద్దె చెల్లించాల్సి ఉంది. 

ఇక సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి  విన్సెంట్‌ జార్జ్‌ ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో కేంద్రం కేటాయించిన భవనంలో ఉంటున్నారు. కానీ ఆయన కూడా 2013 ఆగస్టు నుంచి అద్దె కట్టలేదని, రూ 5,07,911 బకాయిపడ్డారని కేంద్రం తెలిపింది. 

ఢిల్లీలో సొంత కార్యాలయం కట్టుకునేందుకు 9ఏ రోజ్ అవెన్యూలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి స్థలాన్ని కేటాయించింది. 2010 జూన్‌లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఈ స్థలంలో కొత్త భవనంను కట్టుకుని, నిబంధనల  ప్రకారం 2013 నాటికి అక్బర్‌‌ రోడ్డులోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలి.  కానీ ఆ పార్టీ అనేకసార్లు పొడిగింపులను కోరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లోఢీ రోడ్డులో నివసిస్తుండగా, ఆ బంగళాను నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని ప్రభుత్వం 2020 జూలైలో నోటీసు ఇచ్చింది.