పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చన్నీనే

పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం ఎంతో ఎదురు చూసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూకి భంగపాటు తప్పలేదు. వాస్తవానికి పంజాబ్‌ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 
 
ఒకవైపు సిద్ధూ, మరొకవైపు చరణ్‌జిత్ సింగ్ చన్నీలు పోటీపోటాగా ఉన్నారు. కాగా, ఎన్నికల ప్రచారం కంటే ఇదే చర్చ ఎక్కువ కావడంతో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫిబ్రవరి 6న ప్రకటించిన ఈ చర్చకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
 
అనుకున్నట్లుగానే పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యనేతలందరితో నిర్వహించిన సమావేశంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీనే కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి అని రాహుల్ గాంధీ ప్రకటించారు.  బలహీనమైన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోందని సిద్దు పేర్కొన్న మరుసటిరోజు చన్నీ పేరును ప్రకటించడం గమనార్హం.
 అయితే ఈ ప్రకటనకు కొద్దిసేపు ముందుగా రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని సిద్ధూ తెలిపారు. వాస్తవానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా అనంతరం సిద్ధూనే ముఖ్యమంత్రి అవుతారని చాలా మంది అనుకున్నారు. కానీ, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా ప్రకటించారు.
 
ఇక వచ్చే ఎన్నికల్లో సిద్ధూనే ముఖ్యమంత్రనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ, కొద్ది సమయంలో చన్నీ తన ఇమేజ్‌ను విపరీతంగా పెంచుకున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో కానీ, ప్రజల్లో కానీ చన్నీ బాగా పేరు తెచ్చుకున్నారు. దీంతో మళ్లీ చన్నీకే ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
 
కాగా, దీనికి ముందు సిద్ధూ మాట్లాడుతూ ‘‘రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తాను. ఒకవేళ అధికారం నాకు ఇస్తే మాఫియాను నిర్మూలించడానికి ప్రయత్నిస్తాను. ప్రజల జీవన విధానాన్ని మెరుగు పర్చడానికి పని చేస్తాను. ఒకవేళ అధికారం ఇవ్వకపోతే, అవకాశం ఇచ్చే వారితో నవ్వుతూ పని చేస్తాను’’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ, సీఎం చన్నీ అక్కడే ఉన్నారు. అంటే తాను తప్పా మరెవ్వరు మంచి పాలన అందీయలేరని స్పష్టం చేసినట్లయింది.