గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకల్లో వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన

గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి.  రిపబ్లిక్‌ డే ముగింపు వేడుకల్లో భాగంగా బీటింగ్‌ రిట్రీట్‌లో డ్రోన్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వదేశీ సాంకేతికత ద్వారా రూపొందించైనా  1,000 డ్రోన్‌లతో 10 నిమిషాల పాటు ప్రదర్శన ఏర్పాటు చేశారు.
 
75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా జరుపుకునే వేడుకలో భాగంగా డ్రోన్ షో, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ షో కనువిందు చేసింది. 
 
ఆకాశం లోకి రివ్వున ఎగిరిన ఈ డ్రోన్లు లేజర్ వెలుగులను విరజిమ్ముతూ ప్రత్యే ఆకృతుల్లో కనువిందు చేశాయి. త్రివర్ణ కాంతులతో అబ్బురపరిచాయి. బీటింగ్ రీట్రీట్ సందర్భంగా రాష్ట్రపతి భవన్ మువ్వన్నెల కాంతుల్లో ధగధగలాడింది.
 
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు (టీడీబీ) నిధులతో ప్రారంభమైన ఇండియన్ స్టార్టప్ ‘బోట్‌ల్యాబ్’ 1000 డ్రోన్లతో లేజర్ ప్రదర్శన నిర్వహించింది.
 
ఐఐటి ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్స్ డైనమిక్ అనే అంకుర సంస్థ ఈ డ్రోన్ల షోను రూపొందించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ల ప్రదర్శన నిర్వహించగా, ఈ చారిత్రక ప్రదర్శనతో భారత్ కూడా ఆ జాబితాలో చేరింది.
 
భారత మువ్వన్నెల జెండా, జాతీయ జంతువు, జాతీయ పుష్పం, మహాత్మాగాంధీ వంటి ఆకృతుల్లో ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ కనువిందు చేశాయి. వీటికి అనుగుణంగా దేశభక్తి ట్యూన్లను ప్లే చేశారు.  
 
ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ లతో సహా కేంద్రమంత్రులు, ప్రముఖులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధాల్లో సాయంకాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కుతగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్‌ రిట్రీట్‌ను నిర్వహిస్తారు.
 
ఈ వేడుకల్లో భాగంగా అనేక కొత్త ట్యూన్‌లను చేర్చారు. రక్షణ శాఖ సహాయంతో కొత్త ట్యూన్లు చేర్చారు.‘హింద్ కి సేన’, కేరళ’, ‘ఏ మేరే వతన్‌కే లోగోన్’  ట్యూన్లు ఉన్నాయి. ‘సారే జహాన్ సే అచ్చా’ ట్యూన్‌తో బీటింగ్ రిట్రీట్ పరేడ్ ముగిసింది.