అవినీతి అంటే చెద వంటిది, దీనివల్ల దేశం గుల్ల

అవినీతి అంటే ఓ చెద వంటిదని, అది దేశాన్ని గుల్ల చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ చెదను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
 
2022లో తొలి ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత భారత దేశం గురించి బాలలు మాట్లాడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.  కోటి మందికి పైగా బాలలు తమ మనసులో మాటను పోస్టు కార్డుల ద్వారా తనకు తెలియజేశారని చెప్పారు.
ఈ పోస్టు కార్డులు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చాయని, అదేవిధంగా విదేశాల నుంచి కూడా కొన్ని వచ్చాయని తెలిపారు. మన దేశ భవిష్యత్తు పట్ల నూతన తరం దృక్పథం విస్తృతంగా, సమగ్రంగా ఈ పోస్ట్ కార్డుల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక రాసిన పోస్ట్ కార్డ్‌లోని విషయాన్ని ప్రస్తావిస్తూ, 2047నాటికి అవినీతి రహిత భారత దేశాన్ని చూడాలని తాను కలలు కంటున్నానని ఆ బాలిక రాసినట్లు తెలిపారు.  ఈ చెద నుంచి బయటపడటానికి  2047 వరకు ఎందుకు ఆగాలని ప్రశ్నించారు.
దేశ ప్రజలు, యువత అందరూ కలిసికట్టుగా చేయవలసిన పని ఇది అని చెప్పారు. ఈ కృషిని సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని ప్రధాని కోరారు. మన విధులు, కర్తవ్యాలను నిర్వహించేందుకు మనం ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యమని తెలిపారు. కర్తవ్య భావన ఉన్నపుడు, కర్తవ్యమే అత్యున్నతమైనది అయినపుడు అవినీతి ఉండదని చెప్పారు.
న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతిని సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేసినట్లు మోదీ తెలిపారు. ఈ భావోద్వేగ, ఉత్తేజ సమయంలో  అమర వీరుల కుటుంబ సభ్యులు, ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారని తెలిపారు. ఈ యుద్ధ స్మారకాన్ని ప్రజలు సందర్శించాలని కోరారు.
కాగా, దేశంలో కరోనా మూడో వేవ్ ప్రారంభమైనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని చెబుతూ, మన దేశంలో తయారైన టీకాల పట్ల ప్రజలు చూపిస్తున్న నమ్మకాన్ని ప్రధాని కొనియాడారు. ఇప్పటికే 75 శాతం మంది వయోజనులకు టీకాలు వేయడం పూర్తయిన్నట్లు ప్రధాని ప్రకటించారు.
గాంధీజీకి రాష్ట్రపతి, ప్రధాని నివాళి 
ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. 
 
‘మహాత్మ గాంధీ పుణ్యతిథి నాడు బాపూజీ గారిని స్మరించుకుంటున్నారు. ఆయన ఉదాత్తమైన ఆశయాలను మరింత ప్రాచారంలోకి తీసుకురావడం  కోసం సమిష్టిగా ప్రయత్నించాలి. ఈ రోజు అమరవీరుల దినోత్సవం సందర్భంగా  మన జాతిని ధైర్యంగా కాపాడిన మహనీయులందరికీ నివాళులు అర్పిస్తున్నాము’ అని ప్రధాని ఓ ట్వీట్ లో తెలిపారు. 
 
`వారి సేవ, ధైర్యసాహసాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అంటూ మోదీ  ట్వీట్ చేశారు. గాంధీజీ వర్థంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌లో మహాత్మా గాంధీ వాల్ పేపనర్ ఆవిష్కరించారు.