కేటీఆర్ డైరెక్షన్ లోనే దాడి… అరవింద్ ఆరోపణ 

మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లో, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పర్యవేక్షణలోనే తనపై దాడి జరిగిందని బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్  ఆరోపించారు. మొన్న సాయంత్రమే సీపీకి ఫోన్ చేసి దాడి జరిగే అవకాశముందని చెప్పినా తనకు  భద్రత కల్పించలేదని మండిపడ్డారు. తన  ప్రాణం తియ్యడానికి పోలీసులు ప్లాన్ చేశారని ఆరోపించారు.

కలెక్టర్ కు ఫోన్ చేసినా స్పందన కరువైందని చెబుతూ దాడి జరిగిన ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నుంచి 25 మంది ఆయుధాలతో నిజామాబాద్ వచ్చారని ఆరోపించారు. “నా ప్రాణం కాపాడినందుకు నా కార్యకర్తలకు ధన్యవాదాలు” అని తెలిపారు.

పోలీస్ కమిషనర్ నియామకం అయినప్పటి నుంచి కలిసేందుకు ప్రయత్నం చేస్తే సమయం ఇవ్వలేదని ఎంపీ ఆరోపించారు.   పసుపు రైతుల పేరుమీద అడ్డుకునే కుట్ర చేశారని పేర్కొన్నారు. నిన్నటి ఘర్షణకు తమకుకు సంబంధం లేదని పసుపురైతు ఐక్య వేదిక ప్రకటన విడుదల చేసిందని గుర్తు చేశారు. 

దాడికి పాల్పడింది రాము, మ్యూనిరుద్దీన్ అని స్పష్టం చేస్తూ ముస్లిం ప్రజలు పసుపు ఎప్పటినుంచి పండిస్తున్నారో తనకైతే సమాచారం లేదని ఎద్దేవా చేశారు. దాడి జరిగిన స్థలంలో టీఆరెస్ ఎంపిటిసిలు, సర్పంచ్ లు, కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. 

ఆర్ముర్ ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెనుకుండి నడిపిస్తున్నాడని అరవింద్ ఆరోపించారు.   తమను ఎదుర్కోలేకనే టీఆర్ఎస్ పార్టీ దాడులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. హీన సంస్కృతికి టీఆర్ఎస్ తెర తీసిందని ధ్వ‌జ‌మెత్తారు. 

వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఓడిస్తాన‌ని సవాల్ విసిరారు. జీవ‌న్ రెడ్డికి దమ్ముంటే కేసీఆర్ నుంచి టికెట్ తెచ్చుకోవాల‌న్నారు. ఈ దాడిని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఇక రోజులు దగ్గరపడ్డాయని హెచ్చ‌రించారు.

రాజకీయంగా ఎదుర్కొనలేకనే దాడి
 
 కాగా, తెలంగాణలో బీజేపిని రాజకీయంగా ఎదుర్కొలేకే  టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ  విజయశాంతి మండిపడ్డారు. ప్రజల్లో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని, అది చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ సర్కారు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని ఆమె ధ్వజయంట్టారు. 
 
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడి అందుకు నిదర్శనమని చెబుతూ నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని పలు గ్రామాల్లో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి అరవింద్ వెళ్తే టీఆర్ఎస్ గుండాలు దారిలో అడ్డుకుని దాడి చేయడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని ఆమె విమర్శించారు. 

ఎంపీ కాన్వాయ్ పై రాళ్లు, కత్తులతో దాడి చేసి రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని కేసీఆర్ మరోసారి రుజువు చేశారని ఆమె దుయ్యబట్టారు.  పోలీసులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా  అనే సందేహం కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు టీఆర్ఎస్ సర్కారుకు తొత్తులుగా మారారని ఆమె ధ్వజమెత్తారు. 

ఒక పార్లమెంట్ సభ్యుడికే ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలని ఆమె ఎద్దేవా చేశారు. చట్టం మీద నమ్మకంతోనే తమ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారని.. లేకుంటే టీఆర్ఎస్ దాడులకు ప్రతి దాడులు తప్పవని ఆమె హెచ్చరించారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని, రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ఆమె స్పష్టం చేశారు.