కరోనా బారిన పడ్డ చిరంజీవి, శ్రీకాంత్

మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ కరోనా బారిన పడ్డారు. తాజాగా తాను కరోనా బారిన పడినట్లు చిరంజీవి  సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మూడో వేవ్ మొదలైనప్పటికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. 
 
చిరంజీవి  హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ఇటీవల ఆయనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవలసిందిగా ఆయన ట్వీట్‌లో కోరారు. కాగా, చిరు కరోనా బారిన పడిన విషయం తెలిసిన అభిమానులు ..ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.  
 
టాలీవుడ్‌లో శతాధిక చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో శ్రీకాంత్. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్‌గానూ, విలన్ గానూ సత్తాచాటుకుంటున్నారు. ఇటీవలే ఓ సీనియర్ హీరో సినిమాలో విలన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.  తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
 
 ‘మిత్రులారా.. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. నాతో కాంటాక్ట్ లో ఉన్నవారికి ఎవరికైనా ఆ లక్షణాలున్నట్టైతే.. వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోండి’ అని ట్విట్టర్ వేదికగా అభ్యర్ధించారు శ్రీకాంత్.