సిద్ధూ కోసం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాబీ

పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోసం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాబీలకు పాల్పడ్డారని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధూని తన కేబినెట్ నుంచి తొలగించినప్పుడు పాక్ నుంచి అనేక విజ్ణప్తులు తనకు వచ్చాయని, సిద్ధూని మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోవాలని స్వయంగా పాకిస్తాన్ ప్రధానే తనకు రిక్వెస్ట్ పంపారని ఆయన వెల్లడించారు. 
 
సిద్ధూ తనకు పాత మిత్రుడని ఇమ్రాన్ గుర్తు చేసినట్లు చెప్పారు.  పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి అమరీందర్ పోటీకి దిగుతున్నారు. సోమవారం ఇరు వర్గాల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. 
 
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అమరీందర్ మాట్లాడుతూ ‘‘సిద్ధూని తిరిగి కేబినెట్‌లోకి తీసుకుంటే బాగుటుంది. అతడు నాకు పాత మిత్రుడు. అయితే అతడు బాగా పని చేయడం లేదని మీరు అనుకుంటే మీరు అతడిని మళ్లీ తొలగించవచ్చు’’ అని పాకిస్తాన్ ప్రధానమంత్రి తనకు విజ్ణప్తి చేసినట్లు వెల్లడించారు. 
 
కాగా, అమరీందర్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సమయానికే సిద్ధూ మీడియాతో మాట్లాడారు. అమరీందర్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా తానేం స్పందించబోనని సిద్ధూ పేర్కొన్నారు. ‘‘నేను దీనిపై ఏమీ స్పందించదల్చుకోలేదు. ఆయన ఇప్పుడు ఎవరి కోసం పని చేస్తున్నారో అందరికి బాగా తెలుసు’’ అని సిద్ధూ పేర్కొన్నారు. 
 
2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ఎన్నికయ్యారు. అనంతరం సిద్ధూని తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల జూలై 2019లో అమరీందర్ ప్రభుత్వం నుంచి సిద్ధూ బయటికి వచ్చారు.
 
ముందుగా భారతీయ జనతా పార్టీ నేతగా లోక్ సభకు ఎన్నికైన   సిద్ధూ.. చాలా కాలం క్రితమే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన సిద్ధూ ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వాను కౌగిలించుకున్నారు. ఇది దేశంలో రాజకీయంగా పెద్ద వివాదానికి దారి తీసింది. 
 
పాక్‌తో భారత్ కు  ఉన్న వివాదాల దృష్ట్యా పాక్ ఆర్మీ చీఫ్‌ను సిద్ధూ కౌగిలించుకోవడంపై ప్రధానంగా బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘పాకిస్తాన్ అనుకూలంగా ఉండే సిద్ధూ తీరుకు నేను వ్యతిరేకం. భారత సైనికుల్ని సరిహద్దులో పాకిస్తానీలు చంపుతున్నారు. కానీ సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకున్నారు’’ అంటూ అప్పట్లో అమరీందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
65 సీట్లలో బిజెపి పోటీ 
 
ఇలా ఉండగా,  వచ్చే నెలలో జరిగే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 65 స్థానాల్లో, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని నయా పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ 37 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కూటమిలోని మూడవ పార్టీ అకాలీదళ్‌ (సంయుక్త్‌) మరో 15 స్థానాల్లో బరిలోకి దిగనుంది. 
 
ఈ మేరకు సీట్ల సర్దుబాట్లు చేసుకున్నట్లు ఢిల్లీలో అమరీందర్‌ సింగ్‌, బిజెపి చీఫ్‌ జెపి నడ్డా, శిరోమణి అకాలీదళ్‌ సంయుక్త్‌ చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండ్సా ప్రకటించారు. ఆహార భద్రత, రక్షణలో పంజాబ్‌ను ఆకాశానికెత్తేసిన నడ్డా… ఈ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం నిమిత్తం డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. 117 స్థానాలకు వచ్చే నెల 20న జరిగే ఎన్నికల నేపధ్యంలో అమరీందర్‌ సింగ్‌ ఆదివారం 22 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు.