కరోనా బారినపడ్డ శరద్ పవార్

ఎన్సీపీ అధినేత, మాజీ ఉపప్రధాని శరద్ పవార్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయింది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయనపేర్కొన్నారు. 
 
హోం ఐసోలేషన్ లో ఉండి డాక్టర్ల సూచన మేరకు చికిత్స  తీసుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారంతా కరోనా టెస్టు చేయించుకోవాలని శరద్ పవార్ కోరారు. కరోనాకు గురయి లూథియానా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంజాబ్ మాజీ  ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కు వైద్య పరీక్షలో ఓమిక్రాన్ గా నిర్ధారణ అయింది. 
కాగా, గత రెండు రోజుల నుంచి కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తున్నా వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు మించి కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,06, 064 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 8.2 శాతం తక్కువ నమోదయ్యాయి. ఆదివారం 439 మంది మృత్యువాత పడ్డారు.
 దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,89,848కు పెరిగింది. ఒక్క కర్ణాటకలోనే 50 వేల కేసులొచ్చాయి. ఆ తరువాత కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది.  రోజువారీ పాజిటివిటి 17.07 శాతం నుంచి 20.75 శాతానికి పెరిగింది.
ఈనెల 26న రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యే వారి కోసం ఢీల్లీ పోలీసులు సోమవారంనాడు మార్గదర్శకాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ డోస్‌లు పూర్తిగా వేయించుకుని ఉండాలని, 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించేది లేదని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం సహా కోవిడ్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని ఓ ట్వీట్‌లో ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.