ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు తగ్గే అవకాశం

ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే టీకా కార్యక్రమం మూడో వేవ్ ప్రభావాన్ని బాగా తగ్గించిందని పేర్కొన్నాయి.

 ‘ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో కేసులుతగ్గడం, స్థిరంగా ఉండడం ప్రారంభమైంది’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం సోమవారం(జనవరి 24న) 3,06,064 కేసులు వెలుగు చూశాయి. ఆదివారం 3.33 లక్షలు, శనివారం 3.37 లక్షలు, శుక్రవారం 3.47 లక్షల కేసులు నమోదయ్యాయి. 

మూడు రోజులుగా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. మరో వైపు ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లో కేసులు తగ్గుతున్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో సోమవారం 9,197 కేసులు వెలుగు చూశాయి. అంతకు ముందు రోజు నమోదయిన 11,486 కేసులతో పోలిస్తే 11 శాతం తక్కువ నమోదయ్యాయి.

అలాగే పాజిటివిటీ రేటు సైతం ఒక దశలో కొద్ది రోజుల క్రితం 30 శాతంకు పైగా ఉండగా ఇప్పుడది 13.3 శాతానికి తగ్గింది. అలాగే ముంబయిలో తాజాగా 2,550 కొత్త కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల క్రితం వరకు నగరంలో రోజూ 10 వేలకు పైగా కేసులు వస్తుండేవి.

మరో పక్క దేశంలో అర్హులైన వయోజనుల్లో 74 శాతం రెండు డోసుల టీకా తీసుకున్నారు. అలాగే 15 నుంచి 18 ఏళ వయసున్న టీనేజర్లకు టీకా తొలి డోసు ఇస్తున్నారు. 60 ఏళ్లు దాటి ఇతర అనారోగ్యాలతో బాధపడే వారు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వైద్య సిబ్బందికి ప్రికాషనరీ డోసు ఇవ్వడం వంటి చర్యలు మూడో  వేవ్ తీవ్రతను తగ్గించిందని నిపుణులు చెబుతున్నారు. 

మరో వైపు మూడు  వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా రానున్న వారాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. అలాగే ప్రధాన నగరాల్లో కేసులు తగ్గుతున్నా ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయన్నారు.ప్రస్తుతం కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించనప్పటికీ ఏ మాత్రం అజాగ్రత్త వద్దని హెచ్చరిస్తున్నారు.

దేశంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు దడ పుట్టిస్తోంది. ఆదివారం రోజున ఇది 17.78 శాతం ఉండగా, సోమవారానికల్లా 20.75 శాతానికి పెరిగింది. కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటున్న ప్రతి 100 మందిలో ఎంతమందికి పాజిటివ్‌ నిర్ధారణ అవుతోందో తెలిపే సూచిక ‘పాజిటివిటీ రేటు’. ఇది దేశంలోని 207 జిల్లాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.

తిరువనంతపురం (కేరళ), ఫరీదాబాద్‌ (హరియాణ), ఉత్తర గోవా జిల్లాల్లో పాజిటివిటీ రేటు సగటున 46 శాతం మేర ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ లెక్కన అక్కడ కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటున్న ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అవుతోంది. రోహ్‌తక్‌ (హరియాణా), పుణె (మహారాష్ట్ర), మొహాలీ (పంజాబ్‌) జిల్లాల్లోనూ పాజిటివిటీ 40 శాతానికిపైనే ఉండగా, దక్షిణ గోవా జిల్లాలో ఇది 39 శాతానికి చేరువలో ఉంది. మరోవైపు వరుసగా నాలుగోరోజూ దేశంలో కరోనా కేసులు తగ్గాయి.

సోమవారం నాటికి గడచిన 24 గంటల్లో కొత్తగా 3.06 లక్షల మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. క్రియాశీల కేసుల సంఖ్య మాత్రం మరో 62,130 పెరిగింది. దీంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 241 రోజుల (2021 మే నాటి) గరిష్ఠానికి పెరిగి 22.49 లక్షలకు చేరింది. కరోనాతో 439 మంది మృతిచెందారు.

ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ (81)కు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దీనిపై పవార్‌ ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో హోం ఐసొలేషన్‌లో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సోమవారం ఫోన్‌ చేసి ఆరోగ్యసమాచారం తెలుసుకున్న ప్రముఖుల్లో ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌షా తదితరులు ఉన్నారు.