850 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా!

మరో పక్షం రోజులలో   బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతున్న పార్ల‌మెంట్ లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. ఒక‌రిద్ద‌రు కాదు ఏకంగా 850మంది పార్ల‌మెంట్ సిబ్బందికి క‌రోనా పాజిటీవ్ గా నిర్ధార‌ణ అయింది. వీరిలో 250మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నార‌ని స‌మాచారం. 
 
త్వ‌ర‌లో పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పార్ల‌మెంట్ సిబ్బంది అధికంగా క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతుండ‌టంపై పార్లమెంటు అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటూ.. సిబ్బందికి కీలక సూచనలు చేశారు. 
 
ఎలాంటి లక్షణాలు లేని వారే విధులకు హాజరుకావాలనీ, స్వల్ప లక్షణాలు ఉన్నా విధులకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డ వారిలో ప‌లువురు హోం క్వారంటైన్ లో ఉండ‌గా, మ‌రికొంత మంది కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఐసోలేషన్‌లో ఉన్నార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 
 
అయితే, వీరంద‌రికీ ఒమిక్రాన్ సోకిందా? అనే అనుమానాలు సైతం వ్య‌క్తమ‌వుతున్నాయి. అటు జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.