ఫిబ్రవరి 10 నుండి ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

దేశంలో కీలకమైన  ఉత్తర ప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో గల 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనున్నామని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) సుశీల్‌ చంద్ర ప్రకటించారు.  ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీవరకు ఏడు దశల్లో పోలింగ్‌ను నిర్వహిస్తామని ఎన్నికలు నిర్వహిస్తామని, మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తామని  సిఈసి వెల్లడించారు.
ఉత్తర్ ప్రదేశ్లో ఏడు దశలలో ఎన్నికలు జరుగుతాయి.  ఫిబ్రవరి 10న మొదటి దశ ఎన్నిక జరగనుండగా, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఫిబ్రవరి 14న, మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.
ఉత్తర ప్రదేశ్ లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చ్ 3, 7 తేదీలలో ఎన్నికలు జరుగనున్నాయి. జనవరి 14న తొలిదశ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది.  ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ నేటి నుండే అమల్లోకి వచ్చింది.
ఈ నెల 15 వరకు రాజకీయ పార్టీలు రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలకు పర్మిషన్ లేదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి యాత్రలు, ర్యాలీలకు అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60  శాసన సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. 
 
 ఐదు రాష్ట్రాల్లో మొత్తం మొత్తం 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 24.5 లక్షల కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఇందులో అధిక శాంతం మహిళా ఓటర్లే ఉన్నారని వివరించారు. ఇందుకు అనుగుణంగా 2,15, 368 పోలింగ్‌ కేం ద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
 
కరోనా మహమ్మారి పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలను మినీ జాతీయ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో 900 మంది ఎన్నికల అబ్జర్వర్లను నియమించామన్నారు. 
కరోనా సోకిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఈసారి అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చును ఎలక్షన్ కమిషన్ రూ.40లక్షలకు పెంచింది. ఎన్నికల్లో ప్రలోభాలపై సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. దివ్యాంగులు, 80ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది.
పార్టీలో అభ్యర్థుల నేర చరిత్రను వైబ్ సైట్లో పెట్టడంతో పాటు వారి ఎంపికకు కారణాలను బహిర్గతం చేయాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అర్హులైన ఎన్నికల సిబ్బందికి కోవిడ్ బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. కేంద్రంతో పాటు అన్ని పార్టీల నాయకులతో చర్చించిన తర్వాతే ఎన్నికల నిర్వాహణపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గతంలో ఒక్కో పోలింగ్ బూత్ లో గరిష్టంగా 1,500 మంది ఓటర్లు ఉండగా.. కరోనా దృష్ట్యా ఈసారి ఆ సంఖ్యను 1,250కు కుదించారు. ఫలితంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య 16శాతం మేర పెరిగింది. ఐదు రాష్ట్రాల్లోని 690 నియోజకవర్గాల్లో 2.15లక్షల పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు