భారత భద్రతా దళాల యూనిఫాం మార్పు

భారత భద్రతా దళాల యూనిఫాం మారనుంది. ఆర్మీ డే సందర్భంగా కొత్తగా డిజైన్‌ చేసిన యూనిఫామ్‌ను ఈ నెల 15న మొదటిసారిగా ప్రభుత్వం ప్రదర్శించనుంది. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ఆర్మీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టి) సంయుక్తంగా ఈ యూనిఫామ్‌ను డిజైన్‌ చేశారు.
సైనికుల సౌలభ్యం, వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని డిజిటల్‌ డిస్రప్టివ్‌ ప్యాటర్న్‌లో దీన్ని రూపొందించారు. ఉష్ణోగ్రతలు ఎంతగా పెరిగినా, మైనస్‌ డిగ్రీలకు పడిపోయినా శరీరం తట్టుకునేలా మన్నికైన, తేలికైన వస్త్రంతో దీన్ని అభివృద్ధి చేశారు. వీటి రంగులో మార్పులేమీ చేయలేదు. ప్రస్తుతం ఉన్న ఆలివ్‌ గ్రీన్‌, మట్టి రంగుల మిశ్రమం అలాగే ఉంటుంది.
కానీ.. డిజైన్‌, క్లాత్‌ మారనుంది. ఉద్యోగుల ర్యాంకులు సూచించేలా భుజాలపై ప్రత్యేక గుర్తులు ఏర్పాటు చేస్తారు. బెల్టుల్లో కూడా మార్పులు ఉండొచ్చు. ఈ యూనిఫాం బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉండదు. సైనికాధికారులు, జవాన్లకు వారి యూనిట్లలో దీన్ని అందిస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు ఓపెన్‌ టెండర్లు జారీ చేయనున్నారు.
భారత ఆర్మీ యూనిఫాం మార్చడం వరుసగా ఇది నాలుగోసారి. స్వాతంత్య్రానంతరం భారత్‌, పాకిస్తాన్ల డ్రెస్‌లు భిన్నంగా ఉండాలంటూ మొదటి సారిగా భారత ఆర్మీ యూనిఫాంను మార్చారు. 1980లో మరోసారి మార్పులు చేశారు. బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌లకు వేర్వేరు యూనిఫాంలు ఉండాలన్న ఉద్దేశంతో 2005లో మరోసారి మార్చారు.